పిల్లల కోసం ఫ్రెండ్లీ కోర్టు: సౌతిండియాలోనే హైదరాబాద్లో తొలిసారి
హైదరాబాద్: దక్షిణ భారత దేశంలోనే మొట్టమొదటిసారి హైదరాబాదులోని నాంపల్లిలో చిల్ట్రన్ కోర్టును ఏర్పాటు చేశారు. గోవా, దేశ రాజధాని ఢిల్లీ అనంతరం చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు ఏర్పాటైన మూడో రాజధాని తెలంగాణ. ఇందులో ప్రత్యేక వెయిటింగ్ రూంలు, వీడియో కెమెరా ట్రయల్స్ ఉంటాయి.
ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును బుధవారం నాడు నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ కాంప్లెక్సులో ప్రారంభించారు. దీనిని హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అనురాగ్ శర్మ మాట్లాడారు. దక్షిణ భారత దేశంలో తొలిసారి నాంపల్లి కోర్టులో చిల్డ్రన్ కోర్టు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ కోర్టులో బాధిత పిల్లలు కోర్టు వాతావరణం చూసి భయపడకుండా, ఆహ్లాదకరమైన వాతావరణంలో విచారణ జరిగేలా చిల్డ్రన్ కోర్టును ఏర్పాటు చేశారు. చైల్డ్ కోర్టును నిర్వహించేందుకు అందరు సహకరించాలని నాంపల్లి చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు చీఫ్ జస్టిస్ రజని కోరారు.
చీఫ్ జస్టిస్ రజనీ ఇంకా మాట్లాడుతూ... పోస్కో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్ర సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 1640 కేసులు పెండింగులో ఉన్నాయని చెప్పారు. ఇవి 2015 వరకు లెక్కలు అని చెప్పారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. పిల్లలు (సాక్షి లేదా బాధితులు) నేరుగా జడ్జితో ఇంటరాక్ట్ కావొచ్చని చెప్పారు. దీనిని నిందితుడు రెండు విధాలైన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు రూంలో జరుగుతున్న దానిని చూడవచ్చు, వినవచ్చు. కాగా, ఈ కోర్టులో జడ్జి, పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉంటారు.