జగన్ ఎఫెక్ట్: బాబుపై డైలమా, అమిత్ షా ఆకర్ష్ కు బ్రేకులు?
తెలంగాణలో ఇతర పార్టీలను బిజెపిలో చేర్చుకొనే విషయంలో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొనే పరిస్థితిలో ఆ పార్టీ లేదు.
హైదరాబాద్: తెలంగాణలో ఇతర పార్టీలను బిజెపిలో చేర్చుకొనే విషయంలో ఇప్పటికిప్పుడే నిర్ణయాలు తీసుకొనే పరిస్థితిలో ఆ పార్టీ లేదు. బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న పార్టీ నాయకుల గత చరిత్రను పరిశీలించిన తర్వాత పార్టీలో చేర్చుకొనే విషయామై బిజెపి ఆఫర్ ను ప్రకటిస్తోంది. మరో వైపు టిడిపి చీఫ్ చంద్రబాబనాయుడితో చర్చించిన తర్వాత కూడ బిజెపి, టిడిపి పొత్తు వ్యవహరంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మూడురోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా పర్యటించనున్నారు. అయితే ఈ మూడు రోజుల పర్యటనలో ఇతర పార్టీల నుండి బిజెపిలో చేరికలను ప్రోత్సహించేలా తొలుత ప్లాన్ చేశారు.అయితే తర్వాత ఆ పార్టీ వ్యూహాన్ని మార్చివేసింది.
ఇతర పార్టీలనుండి బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న నాయకుల బలబలాలను, పార్టీలో చేరితే ఎన్ని అసెంబ్లీ సీట్లను, పార్లమెంట్ సీట్లను వారికి ఇవ్వాల్సి వస్తోంది, పార్టీకి ఏ మేరకు వారితో ప్రయోజనమనే విషయాలపై ఆరా తీస్తోంది.
ఈ మూడు రోజుల పర్యటన తర్వాత ఈ ఏడాది చివర్లో అమిత్ షా మరో సారి తెలుగురాష్ట్రాల్లో పర్యటించనున్నారు.ఈ పర్యటన సందర్భంగా ఇతరపార్టీలనుండి బిజెపిలో చేరికలు ఉండే అవకాశాలు లేకపోలేదని ఆ పార్టీవర్గాలు చెబతున్నాయి.
చంద్రబాబుతో భేటీ తర్వాత పొత్తుపై నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ నెల 24, లేదా 25 తేదిల్లో సమావేశం కానున్నారు. అమిత్ షా 24న, మధ్యాహ్నం విజయవాడ నుండి తిరిగిరానున్నారు. అయితే తెలగాణలో జరిగే పార్టీ మహనాడులో పాల్గొనేందుకు చంద్రబాబునాయుడు ఈ నెల 24న, హైద్రాబాద్ కు రానున్నారు. అయితే అమిత్ షా తో వీలైతే 24వ, తేది సాయంత్రం లేదా 25వ, తేది ఉదయం బాబు సమావేశం కానున్నారు. అయితే ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. తెలంగాణకు చెందిన బిజెపి నాయకులు టిడిపితో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేయాలని ఆ పార్టీ భావిస్తోంది.ఈ మేరకు బిజెపి నాయకులు చేసిన ప్రకటనలను టిడిపి చీఫ్ అమిత్ షా వద్ద ప్రస్తావించనున్నారు.
జగన్ తో మోడీ భేటీ తర్వాత పరిస్థితులపై చర్చ
ఆంధ్రప్రదేశ్ లో విపక్షనాయకుడు వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోడీతో సమావేశం కావడం తర్వాత చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాలపై బాబు అమిత్ షా తో చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్ డి ఏ అభ్యర్థికి వైసీపీ మద్దతిస్తామని ప్రకటించింది.ఆ తర్వాత టిడిపి, బిజెపి పార్టీల మధ్య మాటల యుద్ద చోటుచేసుకొంది.రాష్ట్రంలో చోటుచేసుకొన్న పరిణామాలను ఆయన చర్చించే అవకాశాలు లేకపోలేదు.
టిడిపిని వదిలించుకోవాలని చూస్తున్న బిజెపి
రెండు తెలుగురాష్ట్రాల్లో బిజెపి నేతలు టిడిపిని దూరం చేసుకోవాలని భావిస్తున్నారు. తెలంగాణలో టిడిపి బాగా బలహీనపడింది. దరిమిలా ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని పార్టీ జాతీయ నాయకత్వానికి చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ లో కూడ బిజెపి నాయకులు టిడిపితో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.ఈ తరుణంలో టిడిపితో పొత్తు లేకపోతేనే ప్రయోజనం అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రధానమంత్రి వైసీపీ చీఫ్ జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడాన్ని టిడిపి నాయకులు తప్పుపట్టడం పట్ల బిజెపి నాయకులు ఒంటికాలిపై లేచారు.తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ను బిజెపి నాయకులు తెరతీశారు. ఇతర పార్టీలకు చెందిన నాయకులతో బిజెపి నాయకులు చర్చలను ప్రారంభించారు. ఈ ఏడాదిలో ఇతర పార్టీలనుండి బిజెపిలో చేరికలు ప్రారంభంకానున్నాయి.
ఆచితూచి అడుగులు వేస్తోన్న బిజెపి నాయకత్వం
తెలంగాణలో ఇతర పార్టీలనుండి బిజెపిలో చేరికల విషయమై ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఆచితూచి అడుగులువేస్తోంది. కాంగ్రెస్, టిడిపి తో పాటు ఇతర పార్టీలనుండి బిజెపిలో చేరేందుకు ఆసక్తిని చూపుతున్న నాయకుల జాబితాను పార్టీ కేంద్రనాయకత్వం వద్ద ఉంది. అయితే ఆయా నాయకులు బిజెపిలో చేరితే ఏ మేరకు పార్టీకి ప్రయోజనం కలుగుతోందనే అంశాలను చర్చించనున్నారు.అయితే ఈ పరిస్థితులపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని నాయకులతో బిజెపి నాయకత్వం ఆరా తీస్తోంది. దక్షిణాదిలో బలాన్ని పెంచుకొనేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో బాగంగానే ఈ రెండు రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ ఎంపి స్థానాలను కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ఇప్పటినుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.