అంబర్పేటలో అదృశ్యం.... ఏడేళ్లుగా హర్యానాలో, ఇల్లు గుర్తొచ్చింది
హైదరాబాద్: నగరంలోని అంబర్పేటలో తప్పిపోయిన ఓ బాలుడు ఏడేళ్ల తర్వాత హర్యానా రాష్ట్రంలోని బివాండి జిల్లాలో ప్రత్యక్షమయ్యాడు. అంబర్పేట డీఐ రవీందర్రెడ్డి కథనం ప్రకారం.. అంబర్పేటకు చెందిన బాలు(ప్రస్తుతం 13ఏళ్లు) 2009లో తప్పిపోయాడు.
ఇక్కడి నుంచి హర్యానా రాష్ట్రంలోని బివాండికి వెళ్లిన అతణ్ని అక్కడి పోలీసులు గుర్తించి, బాలుర సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం కల్పించారు. అక్కడే పెరిగి పెద్దవాడైన బాలు.. ఇన్నాళ్లకు తాను హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతానికి చెందిన వాడినని.. అక్కడి అధికారులకు తెలిపాడు.
దీంతో అక్కడి బాలుర సంరక్షణ కేంద్రం అధికారులు ఇక్కడి అంబర్పేట పోలీసులకు విషయం చెప్పారు. ప్రస్తుతం 13 ఏళ్ల వయస్సున్న బాలు తనకు ఇద్దరు అక్కలు, నలుగురు అన్నదమ్ములు ఉన్నారని చెప్పాడు.
తన పెద్ద అక్కపేరు లక్ష్మి, పెద్ద అన్న పేరు సాగర్ అని చెబుతున్నాడని అధికారులు వివరించారు. బాలు ఫొటోను గుర్తించిన వారు అంబర్పేట పోలీసులను సంప్రదించాలని అడ్మిన్ ఎస్ఐ మధుసూదన్ కోరారు.