సాయం చేయండి: మోడీకి 12 అంశాలపై కెసిఆర్ విజ్ఞాపన పత్రాలు
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. విభజన హామీలు, ఆర్థిక సహాయం, హైకోర్టు విభజన... తదితర 12 అంశాల పైన కెసిఆర్ ప్రధానితో చర్చించారు.
వరంగల్ గిరిజన విశ్వవిద్యాలయానికి సెంట్రల్ యూనివర్సిటీ హోదా ఇవ్వాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. వార్షిక రుణ పరిమితిని అదనంగా 0.5 శాతానికి పెంచాలని కోరారు. సాధారణ, రైల్వే బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు.
కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని కోరారు. టాటా ఇనిస్టిట్యూట్కు అనుమతులు ఇవ్వాలని, అలాగే సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ఆర్థిక సాయాన్ని కూడా కోరారని తెలుస్తోంది.
ఉమ్మడి హైకోర్టును విభజించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే నాలుగేళ్లలో రూ.30,571ను గ్రాంటుగా ఇవ్వాలని కోరారు. మిషన్ భగీరథకు రూ.10వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని, ఎయిమ్స్కు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు. కరువు సాయాన్ని రూ.3,064 కోట్లు ఇవ్వాలని కోరారు. కెసిఆర్ ప్రధాని మోడీకి పలు అంశాలపై విజ్ఞాపన పత్రాలు ఇచ్చారు.
రాష్ట్రానికి ఐపీఎస్ల కొరత ఉందని, దానిని పూరించాలని కెసిఆర్ కోరారు. ప్రాణహిత - చేవెళ్లను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని కోరారు.