ఎమ్మెల్యేలను కొనేస్తున్నారు: కెసిఆర్పై కాంగ్రెస్
హైదరాబాద్: తమ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతుండడంపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కెసిఆర్ శాసనసభ్యులను అడ్డంగా కొనేస్తున్నారని, కార్యకర్తల్లో విశ్వాసం పెంచకపోతే ప్రమాదం వాటిల్లుతుందని వారన్నారు. శుక్రవారం ఉదయం గాంధీభవన్లో తెలంగాణ పిసిసి సమన్వయ కమిటీ సమావేశమైంది
పార్టీ సభ్యత్వ నమోదు, నేతల వలసలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో నేతలు చర్చించారు. సమావేశానంతరం కాంగ్రెసు నేతలు పొన్నాల లక్ష్మయ్య, జానా రెడ్డి, డి. శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ శాసనసభ్యులను కెసిఆర్ ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ప్రజా సమస్యలను విస్మరించి రాజకీయాలే ఎజెండాగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని కాంగ్రెసు నేతలు మండిపడ్డారు. ప్రతిపక్షాలు లేకుండా చేయాలనే కెసిఆర్ ధోరణి ప్రజాస్వామ్యానికే ముప్పు అని వారన్నారు. ఇతర పార్టీలను లొంగదీసుకోవాలనే కెసిఆర్ తీరును తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వారు చెప్పారు.
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై, ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేయాల్సిందేనని వారు అభిప్రాయపడ్డారు. ఇందుకు కౌన్సిల్ చైర్మన్, స్పీకర్లపై ఒత్తిడి పెంచుతామని వారు చెప్పారు. కాంగ్రెసు శాసనసభ్యులు పెద్ద యెత్తున తెరాసలో చేరడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.