తెలంగాణలో ఆ ఐదు జిల్లాల పేర్ల మార్పు: రెవెన్యూ శాఖ ఉత్తర్వులు..
ఈ మేరకు భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల జిల్లాను జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా ప్రభుత్వం పేర్లు మార్చింది.
హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుతో 10జిల్లాల తెలంగాణ కాస్త 31జిల్లాలుగా విస్తరించిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో 5జిల్లాల పేర్లను మార్పు చేస్తు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ జారీ చేసింది.
ఈ మేరకు భద్రాద్రి జిల్లాను భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల జిల్లాను జోగులాంబ గద్వాల, యాదాద్రి జిల్లాను యాదాద్రి భువనగిరిగా ప్రభుత్వం పేర్లు మార్చింది. కొమురం భీం జిల్లా పేరును కుమురం భీం జిల్లాగా పేరు మార్చారు. రాజన్న జిల్లా పేరును రాజన్న సిరిసిల్ల జిల్లాగా మార్చారు.
ఇక జోగులాంబ గద్వాల జిల్లాలోను ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది. కొత్తగా ఏపీ కొండనహల్లి గ్రామాన్ని జోగులాంబ గద్వాల జిల్లాలోని కేటీ దొడ్డి మండలంలో చేర్చారు. అలాగే ముస్లీంపల్లె గ్రామాన్ని గట్టు మండలంలోకి, శాలిపూర్, ఖానాపూర్ గ్రామాలను ఉండవల్లి మండలంలోకి, మంగపేట, రాయిమాకులకుంట్ల, పొసలపాడు గ్రామాలను మనోపాడ్ మండలంలోకి చేర్చారు.