కేసీఆర్ 50 ఏళ్లు పోరాడినా తెలంగాణ రాకపోయేది: జానా, బాబు సరే మరి మీరో: గుత్తా
హైదరాబాద్: ఇద్దరు ఎంపీలతో కేసీఆర్ యాభై ఏళ్లు పోరాడినా తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోయి ఉండేదని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్ష నేత జానా రెడ్డి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి తెచ్చి తెలంగాణ ఇచ్చేలా చేయడంలో కాంగ్రెస్ నేతల పాత్ర ఎంతో ఉందని చెప్పారు.
అందరినీ కలుపుకొని పోరాటం సాగించి తెలంగాణ సాధించామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు వాగ్ధానాలతో అనైతిక పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణగదొక్కాలని చూస్తోందన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్నాళ్లు అధికారంలో ఉంటే ప్రజలు కులాలు మతాలుగా విడిపోయే ప్రమాదం ఉందని జానా రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి గ్రేటర్ హైదరాబాదులో పైశాచికత్వానికి పాల్పడుతున్నాయని ధ్వజమెత్తారు. రాజేంద్ర నగర్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై గుత్తా ఆగ్రహం
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఒత్తిళ్లకు, ప్రలోభాలకు గురి చేస్తు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు ఆ పార్టీ అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా ఉందని నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండలో విమర్శించారు.
ఏపిలో సీఎం చంద్రబాబు, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఇద్దరు ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు 5కోట్లతో ఎమ్మెల్యేను కొనుగోలు చేశాడంటూ విమర్శిస్తున్న కేసీఆర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు బలం లేకున్నా పోటీకి దిగుతూ ఇతర పార్టీల నుండి ఫిరాయింపులు ప్రోత్సహిస్తుండటం ఎంత వరకు సమంజసమన్నారు.
ఫిరాయింపులతో అడ్డదారి రాజకీయాలు సాగించడంలో ఇద్ధరు చంద్రులు దొందుదొందే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 12స్థానిక ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్కు ఐదు స్థానాల్లో మెజార్టీ ఉందన్నారు. నల్గొండ జిల్లాలో 1,112స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్లలో కాంగ్రెస్కు 552ఓట్లు, మిత్రపక్షం సీపీఐకి 30ఓట్లు ఉన్నాయన్నారు.
టీడీపీకి 190, టీఆర్ఎస్కు 140, సీపీఎంకు 57, బీజేపీకి 35, వైసీపీకి 12, ఎంఐఎంకు 3, ఇండిపెండెంట్లు 94మంది సభ్యుల బలం ఉందన్నారు. పోలీసులు, ఉద్యోగులు సైతం ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. ఏదో ఒక రోజు టీఆర్ఎస్ పార్టీకి ఫిరాయింపుదారులతోనే ముప్పు తప్పదన్నారు.