పూజారికి పదివేలు ఇచ్చి, హుండీలో వేయాలని చెప్పి రైతు ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాదులోని లోయర్ ట్యాంక్ బండ్లో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు లోయర్ ట్యాంక్ బండ్లో ఆలయ పూజారికి పది వేల రూపాయలు ఇచ్చి, హుండీలో వేయాలని చెప్పి విద్యుత్తు స్తంభానికి ఉరేసుకుని చనిపోయాడు.
నిజామాబాద్ జిల్లాకు చెందిన లింబయ్య అనే 45 ఏళ్ల రైతు లోయర్ ట్యాంక్బండ్లో ఉరేసుకుని మరణించిన విషయం తెలిసిందే. లింబయ్య మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడిని చాదర్ఘాట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు.
మంగళవారంనాడు లోయర్ ట్యాంక్ బండ్కు వెళ్లి హుండీలో వేయాలని చెప్పి పది వేల రూపాయలు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. పంటలు నష్టపోవడం వల్లనో, అప్పుల పాలు కావడం వల్లనో అతను ఆత్మహత్య చేసుకోలేదని, అతని ఆత్మహత్యకు గల కారణాన్ని తెలుసుకోవాల్సి ఉందని గాంధీ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎ. సంజీవ రావు అన్నారు.
కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం సృష్టించింది.
రైతు లింగయ్య కుటుంబాన్ని పరామర్శించిన రేవంత్
ట్యాంక్బండ్ వద్ద ఆత్మహత్య చేసుకున్న రైతు లింగయ్య కుటుంబాన్ని గాంధీ ఆస్పత్రిలో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పరామర్శించారు. రూ. 50 వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.