‘తెలంగాణ ఫుడ్స్.. ఆంధ్రకు చేదా!’: బాబు రియాక్షన్
హైదరాబాద్: ‘తెలంగాణ ఫుడ్స్.. ఆంధ్రకు చేదా! పేరు మారిస్తేనే కొంటాం' అనే శీర్షికన నమస్తే తెలంగాణ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనం వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణ ఫుడ్స్ పేరు మారిస్తేనే కొంటామని ఏపి మెలిక పెడుతోందని, బకాయిలు కూడా ఇవ్వబోమని మొండిపట్టు పడుతోందని ఆ కథనంలో పేర్కొంది.
తెలంగాణపై ఏపి సిఎం చంద్రబాబునాయుడు ప్రేమకు ఇదే పరాకాష్ఠ! అని పేర్కొంది. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.. తెలంగాణ పేరు ఉన్నదన్న కారణంగా టిఎస్ ఫుడ్స్ సరఫరా చేసే పౌష్ఠికాహార పంపిణీని ఏపీ ప్రభుత్వం ఆపేసింది. తమ రాష్ట్రంలోని పసి పిల్లల నోటి కాడి బుక్కకు అడ్డుపడింది. తెలంగాణ పేరు తీస్తే తప్ప మీ పౌష్ఠికాహారం కొనేది లేదు.. మీరు సరఫరా చేసిన ఆహారానికి బకాయిలు కూడా ఇచ్చేది లేదు.. దిక్కున్న చోట చెప్పుకోమని చంద్రబాబు ప్రభుత్వం హూంకరిస్తున్నది. ఫలితం ఏపీ రాష్ట్రంలో 28 లక్షల మంది పసిపిల్లలకు పౌష్ఠికాహారం అందడం లేదు. ఎదిగే వయసులో చిన్నారులకు కావాల్సిన బాలామృతం, స్నాక్ఫుడ్ గత 45 రోజులుగా నిలిచిపోయింది.
జరిగిన విషయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9, 10 కింద అంతవరకు ఏపీ ఫుడ్స్గా ఉన్న సంస్థ తెలంగాణ రాష్ర్టానికి వచ్చింది. జూన్ 2 తర్వాత పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం దీని పేరును తెలంగాణ స్టేట్ ఫుడ్స్గా మార్చింది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి, అక్కడి అధికారులకు కంటగింపుగా మారింది. అప్పటినుంచి ఏపీ అధికారులు సంస్థ ఆస్తుల్లో వాటాలివ్వాలని, తమ అధికారులను ఎండీలుగా నియమించాలని, మెలికలు పెడుతూ సంస్థ పురోగతికి మోకాలడ్డుతున్నారు.
ఏపి ఫుడ్స్ విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లోఉంది.. కాబట్టి తెలంగాణకు వచ్చింది. అలాగే అదే చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు ఏపీకి కూడా సేవలు అందించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. చట్ట ప్రకారం జరిగిన ఈ తంతును భరించలేని ఏపీ అధికారులు జూన్ 2నుంచి అక్టోబర్ 31వరకు ఆ రాష్ట్ర పిల్లలకు సరపరా చేసిన బాలామృతం, స్నాక్ఫుడ్ బిల్లును నిలిపివేశారు.
సరఫరా చేసిన ఫుడ్కు రూ.110కోట్లు రావాల్సి ఉంది. అందులో రూ.20 కోట్లకు చెక్కులిచ్చి రూ.17 కోట్లకు మాత్రమే బ్యాంకులకు అనుమతి ఇచ్చారు. దీంతో రూ.93కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. వీటి విషయమై ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా స్పందించలేదు. పైగా తెలంగాణ పేరు తొలిగిస్తేనే బకాయిలు చెల్లిస్తామని అంటున్నారు. తెలంగాణ స్టేట్ ఫుడ్స్కు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా అటు ఏపీలోని చిన్నారులకు ఎంతో ఉపయుక్తమైన పౌష్టికాహారం అందించకుండా మొండికేస్తున్నారు. బకాయిలు బిగబట్టి సంస్థను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాలన్న ఎత్తు వేస్తున్నారు. మరోవైపు ఒక్క పేరుమార్పు కోసం 28లక్షల మంది చిన్నారులకు 45రోజుల పాటు పౌష్టికాహారం అందకుండా చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బకాయిలిస్తేనే ఫుడ్ సరఫరా..
కాగా ఏపీ అధికారుల డిమాండ్లకు తలొగ్గేది లేదని తెలంగాణ ఫుడ్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి తెలంగాణ స్టేట్ ఫుడ్స్గా పేరు మారిన తరువాత మరోసారి మార్చడం అసాధ్యమని వారంటున్నారు. చట్టం ప్రకారం 10 సంవత్సరాల పాటు కావాలంటే సేవలిస్తామని తేల్చి చెప్తున్నారు. 28లక్షల మంది చిన్నారులకు నాణ్యమైన న్యూట్రిషియన్ ఫుడ్ను దూరం చేయడమే కాకుండా... తెలంగాణ ప్రభుత్వమే కావాలని టిఎస్ ఫుడ్స్ ద్వారా ఏపీలోని చిన్నారులకు ఇవ్వాల్సిన ఫుడ్ ఇవ్వడంలేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. ఏపీ బకాయిలు రాకపోవడంతో ఇక్కడ తమ సంస్థకు శనగపప్పు, చక్కెర, పాలపొడి తదితర ముడిసరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లు బకాయిలిస్తేనే సరఫరా చేస్తామని అంటున్నారని తెలిపారు. సంస్థకు ప్రభుత్వం కొన్ని నిధులిచ్చి ఆదుకుందని వివరించారు. ఏదేమైనా ఏపీ సర్కారు బకాయిలిస్తే తప్ప ఆహారం సరఫరా చేసేది లేదన్నారు.
ఏపీ కాకుంటే మరో రాష్ట్రం..
ఏపీ గనుక బకాయిలు చెల్లించకుండా ఇదే వైఖరి కొనసాగించిన పక్షంలో జనవరి నుంచి మరో రాష్ర్టానికి టిఎస్ ఫుడ్స్ నుంచి బాలామృతం, స్నాక్ఫుడ్ సరఫరా చేసే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దేశంలోనే అత్యంత తక్కువ రేటుకు టిఎస్ఫుడ్స్లో మాత్రమే బాలామృతం, స్నాక్ఫుడ్ లభిస్తోంది. కాబట్టి ఏపీ గనుక కాదనుకుంటే మహారాష్ట్ర, లేదా కర్ణాటకతో ఒప్పందం చేసుకుంటామని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వారినుంచి ఆర్డర్లు కూడా ఉన్నాయి. ఏపీ అంశం తేలిన వెంటనే వారితో అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొంది.