కోదండరామ్ తో ఇంటర్వ్యూ :నయీం తరహలోనే కెసిఆర్ ప్రభుత్వం....
తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ , ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన జెఎసికి చైర్మెన్ గా ఉన్నారు.
హైదరాబాద్ :తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ , ఈ పేరు తెలియనివారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన జెఎసికి చైర్మెన్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ జెఎసి నుండి కొన్ని సంఘాలు బయటకు వెళ్ళినాకాని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ సంఘం పనిచేస్తోందని కోదండరామ్ చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వానికి, టిఆర్ఎస్ నాయకులకు కోదండరామ్ కు మద్య అగాధం పెరిగింది.
తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ భవిష్యత్తులో పార్టీని ఏర్పాటుచేస్తారా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన ఏ రకమైన వ్యూహాన్ని ఎంచుకొంటారు, భూసేకరణను ఆయన ఎందుకు వ్యతిరేకిస్తున్నారు . ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయనకు మద్య సంబంధాలు ఎలా ఉన్నాయి, టిఆర్ఎస్ నాయకులు ఎందుకు కోదండరామ్ ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలను రాబట్టే పనిని ఒన్ ఇండియా చేసింది.
తెలంగాణ జెఎసి చైర్మెన్ కోదండరామ్ తో ఒన్ ఇండియా ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కోదండరామ్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించారు. ప్రాజెక్టులను నిర్మించాలని చెబుతున్నా భూసేకరణను ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చిందో ఆయన వివరిస్తున్నారు. ప్రశ్నించడమే తప్పుగా ప్రభుత్వం మాట్లాడడం సరైంది కాదంటున్నారు కోదండరామ్.తుపాకీ పట్టుకొని గ్యాంగ్ స్టర్ నయిం భూములు లాక్కొనట్టుగానే ప్రభుత్వం కూడ అదికారాన్ని అడ్డు పెట్టుకొని భూమిని లాక్కోంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు.
ప్రాజెక్టుల నిర్మాణానికి అనుకూలమంటూనే , ఎందుకు భూసేకరణను వ్యతిరేకిస్తున్నారు.
పద్దతి ప్రకారంగా వ్యవహరిస్తే ముంపును తగ్గించుకొనే అవకాశం ఉంటుంది. అంతేకాదు వేలాది ఎకరాల భూమి అవసరం లేకుండానే తక్కువ భూమిని సేకరించి ప్రాజెక్టులను నిర్మించే అవకాశాలు కూడ ఉన్నాయి.ఈ దిశగా ప్రభుత్వ ఆలోచనలు మాత్రం లేవు.భూసేకరణను బలవంతంగా ప్రభుత్వం చేపట్టడాన్నే మేం వ్యతిరేకిస్తున్నాం .ప్రజాస్వామ్యయుతంగా భూసేకరణను చేపట్టాల్సిన అవసరం మాత్రం ఉంది.
ప్రాజెక్టులను నిర్మించాలంటే భూసేకరణచేయాల్సిందే కదా?
ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు .అయితే ప్రజల నుండి బలవంతంగా భూమిని సేకరించకూడదనేది తమ అభిప్రాయం. భూసేకరణ అవసరాలను ప్రభుత్వం తగ్గించుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది.ప్రత్యామ్నాయం పద్దతులను అవలంభించాలి.వేలాది ఎకరాల భూమిని సేకరించి నిరూపయోగంగా ఉంచిన ఘటనలు అనేకంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అనుభవాలను ఆయన ఉదహరించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కోసం వేలాది ఎకరాల భూమిని సేకరించి నిరూపయోగంగా ఉంచిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇదే తరహ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడ అవలంభిస్తోందని ఆయన విమర్శించారు.
ఒపెన్ కాస్ట్ గనులపై మీ వైఖరేమిటి?
ఓపెన్ కాస్ట్ గనుల వల్ల గ్రామాలే విధ్వంసానికి గురౌతున్నాయి. ఓపెన్ కాస్ట్ లను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది.ఉద్యమ సమయంలో సింగరేణి తెలంగాణ డెవలప్ మెంట్ కోసం, సింగరేణి డెవలప్ మెంట్ కోసం తెలంగాణ ఉండాలని కోరుకొన్నామని, ప్రస్తుతం ఆచరణలో అందుకు విరుద్దంగా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
బొగ్గు తవ్వడం నిలిపివేయాలా?
లాభాపేక్ష పేరుతో గ్రామాలను విధ్వంసం చేయడం సరైంది కాదు. విచ్చలవిడిగా బొగ్గు తవ్వకం కూడ అవసరం లేదు. అవసరం మేరకే బొగ్గును తవ్వాలి. విచ్చలవిడిగా బొగ్గును తవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదు.
భూసేకరణను అడ్డుకోవడమంటే ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకోవడమేనా?
తమ భూములను సేకరించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి తాము మద్దతిస్తున్నాం, ప్రజల నుండి బలవంతంగా భూమిని సేకరించే పద్దతికి ప్రభుత్వం స్వస్తిపలకాల్సిన అవసరం ఉంది.ఏ పద్దతిలోప్రభుత్వం భూ సేకరణచేపట్టిందో ప్రదానమైందన్నారు కోదండరామ్.
ఏ తరహ పరిహరం కావాలని కోరుకొంటున్నారు?
సుదీర్ఘ పోరాటాల తర్వాతే 2013 భూసేకరణచట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా పరిహరం కావాలని ప్రజలు కోరుతున్నారు.ప్రజల హక్కుల్ని కాలరాయకుండా చట్టబద్దంగా, న్యాయబద్దంగా భూసేకరణచేయాలనేది తమ అభిమతం.ఫ్యూడల్ పద్దతిలో భూసేకరణచేయకూడదని కోరుకొంటున్నాం.50 వేల ఎకరాల భూమి ఫార్మాసిటీ నిర్మాణానికి అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.2000 వ, సంవత్సరం తర్వాత రాష్ట్రంలో సేకరణకు గురైన భూమిలో 25 శాతం కూడ ఉపయోగంలోకి రాలేదు.
భూ సేకరణలో ప్రభుత్వ వ్యవహరశైలి ఎలా ఉంది?
భూ సేకరణలో ప్రభుత్వం వ్యవహరిస్తోన్నతీరు గ్యాంగ్ స్టర్ నయిం తో సరిపోయేటట్టు ఉందని భూ నిర్వాసితులు ఆరోపిస్తున్నారని ఆయన చెబుతున్నారు.. నయిం తుపాకీ పెట్టి బెదిరించి భూమిని లాక్కొన్నాడు. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించుకొని భూమిని లాక్కొనే ప్రయత్నంచేస్తోందని బాధితులు అభిప్రాయపడుతున్నారు. నయింకు, ప్రభుత్వానికి పెద్ద తేడా లేదని భూ నిర్వాసితులు .అభిప్రాయపడుతున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వానికి, గ్యాంగ్ స్టర్ నయింకు మద్య తేడా లేదని ప్రజలు అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. ఇదే అభిప్రాయంతో ప్రజలు ఉంటే ప్రభుత్వానికి మంచిది కాదన్నారుకోదండరామ్.
ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు అవసరం ఉందా?
ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటును వల్ల నష్టం వాటిల్లుతోంది.ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయాల్సి ఉంది.ఉన్నత విద్యరంగానికి నిధులను ఎక్కువ మొత్తంలో కేటాయించాలి. ప్రైవేట్ యూనివర్శిటీల వల్ల తెలంగాణకు ప్రయోజనమేదీ ఉండదు.ఇంటర్ తో పాటు, ఇతర రంగాల్లో కూడ ఆంద్ర కార్పోరేట్ శక్తుల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.