''రైతులకు బేడీలు వేసినవాడు పాపాత్ముడే, తప్పు జరిగింది, అందుకే ఆంధ్రా గో బ్యాక్ అనలేదు''
రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా? పాపాత్ముడవుతాడని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు.పోలీసులు ఆవేశపడి రైతులకు బేడీలు వేశారని కెసిఆర్ వివరణ ఇచ్చారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన అంశంపై కెసి
హైదరాబాద్: రైతులకు బేడీలు వేసినోడు మొగోడైతడా? పాపాత్ముడవుతాడని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు.పోలీసులు ఆవేశపడి రైతులకు బేడీలు వేశారని కెసిఆర్ వివరణ ఇచ్చారు. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన అంశంపై కెసిఆర్ ప్రస్తావించారు.
శనివారంనాడు ప్రగతిభవన్ లో పలువురు సినీ కవులు, దర్శకులు, రచయిలతో సీఎం కెసిఆర్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం చేపట్టిన అంశాలను ప్రస్తావించారు.
ఈ సమయంలోనే ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన అంశాన్ని సీఎం కెసిఆర్ ప్రస్తావించారు. ఖమ్మంలో రైతులకు పోలీసులు బేడీలు వేసిన అంశం రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చతెచ్చింది.ఈ అంశాన్ని విపక్షాలు రాజకీయంగా ఇబ్బందికల్గించింది.
ఖమ్మం మార్కెట్ యార్డుపై రైతుల దాడి అంశంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్దం సాగుతోంది. ఈ అంశాన్ని ఉపయోగించుకొని రాజకీయంగా అధికారపార్టీని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తోంటే, అధికారపార్టీ మాత్రం ఈ విషయంలో నష్టనివారణకు ప్రయత్నిస్తోంది.
రైతులకు బేడీలు వేసినవాడు పాపాత్ముడే
రైతులకు బేడీలు వేసినవాడు పాపాత్ముడే అవుతాడు. గొప్పోడు కాడని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. రైతాంగం సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై ప్రచార కార్యక్రమాల గురించి సినీ దర్శకులు, కవులతో ఆయన సమావేశమైన సందర్భంలో ఖమ్మంలో రైతులకు బేడీలు వేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎంత క్రూరుడైనా రైతులకు బేడీలు వేస్తాడా అని ఆయన ప్రశ్నించారు.రైతులకు బేడీలు వేస్తే పాపం తగులుతోందని ఆయన చెప్పారు. పోలీసులు ఆవేశపడి రైతులకు బేడీలు వేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఏదో చిన్న తప్పు జరిగింది. దానికి ప్రభుత్వమే బేడీలు వేయించినట్టు విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు.రైతులకు ఎవరైనా బేడీలు వేయాలని చెప్తారా అని ఆయన ప్రశ్నించారు.అంత మూర్ఖుడు ఉంటారా అని ఆయన ప్రశ్నించారు.
ఖమ్మం ఘటన బాధ కలిగించింది
ఖమ్మం ఘటన తనకు బాధ కల్గించిందన్నారు ముఖ్యమంత్రి కెసిఆర్.ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకొన్నామని చెప్పారు. తాను కూడ రైతు కుటుంబం నుండే వచ్చినట్టు ఆయన ప్రస్తావించారు.విత్తనాల కోసం లైన్లలో నిలబడ్డొన్ని, రైతు బిడ్డను. రైతుల కష్టాలు, వారి వృత్తి, వ్యవసాయాన్ని ప్రాణంగా కాపాడుకోవాలనే చూస్తానని కెసిఆర్ చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా మాట్లాడడం లేదన్నారు. రైతుల కష్టాలు స్వయంగా చూసినవాడిని, రైతు లెక్కనే మాట్లాడుతున్నానని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.
1969 ఉద్యమం అందుకే విఫలం
ఆంధ్రా గో బ్యాక్ అనే నినాదం కారణంగానే 1969 లో తెలంగాణ కోసం సాగించిన పోరాటం విజయవంతం కాలేదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. తాను చేపట్టిన మలివిడత ఉద్యమ సమయంలో అందుకే ఈ విషయాన్ని తీసుకోలేదన్నారు. ఆంధ్రా గో బ్యాక్ అనే నినాదంలో మానవీయ కోణం లోపించడంతో 1969 ఉద్యమం వైఫల్యం చెందిందని చెప్పారు. అందుకే తాను ఏ రోజు కూడ ఆ విధంగా పనిచేయలేదన్నారు. ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళంతా మా మిత్రులు అని చెప్పాను. ఇప్పటికీ ఇదే మాటకు కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.
కమ్యూనిష్టులకు పనేలేదు, అందుకే
రాష్ట్రంలో కమ్యూనిష్టులకు పనేలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. సమస్యలు దొరకక ఖమ్మం సమస్యను కమ్యూనిష్టులు తీసుకొన్నారని ఆయన చెప్పారు.ఎక్కడ నిరసనలు జరిగినా వాటి కారణాలు, మూలాలను కనుక్కొని రాష్ట్ర ప్రభుత్వం వాటికి పరిష్కారం చూపుతోందన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును గాల్లో కట్టం కదా అన్నారు. ఇది అభివృద్ది ప్రాజెక్టు, దాని కింద లబ్దిదారులు ప్రభుత్వం చెల్లించిన పరిహారంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.కానీ, ఎక్కడెక్కడి నుండో అక్కడికి వెళ్ళి, స్థావరాలు పెట్టి ప్రజలను రెచ్చగొడుతున్నారని చెప్పారు.ఇది పద్దతేనా అని ఆయన ప్రశ్నించారు. విపక్షాలు సమస్యలు పరిష్కారం కావొద్దని అనుకొంటున్నారని చెప్పారు.