నెలకు 4 లక్షలు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీతాల పెంచే యోచనలో కేసీఆర్ సర్కార్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జీత భత్యాలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. జీతభత్యాల పెంపులో భాగంగా దేశంలోని మిగతా రాష్ట్రాల్లోని ప్రజా ప్రతినిధులకు చెల్లిస్తున్న జీతాల వివరాలను తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తోంది.
ఎమ్మెల్యేలతో పాటు కేబినెట్ ర్యాంకు కలిగిన వారికి కూడా జీతం పెంచాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వపు ఎమ్మెల్యేల మాదిరి తెలంగాణ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు రూ. 4 లక్షల జీతం పెంచే ప్రతిపాదనలపై చర్చిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ. 95వేల చోప్పున జీతంగా చెల్లిస్తుంది. జీతాల పెంపుపై తర్వలో ఉత్తర్వులు జారీ అయ్యే అవాకాశం ఉంది.
తెలంగాణ విద్యావ్యవస్థ పూర్తి ప్రక్షాళన: సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణలోని ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్రంలో మెడికల్, అగ్రికల్చర్, ఫార్మా రంగాలు తప్ప మినహా మిగతా అన్ని రకాల, అన్ని స్థాయిల విద్యాసంస్థల నిర్వహణ బాధ్యత విద్యాశాఖకే అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మైనార్టీల కోసం 60 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా నిధులు విడుదల చేసి విద్యాశాఖ నిర్వహణ నియంత్రణలో రెసిడిన్షియల్ స్కూళ్లు ఉండాలని నిర్ణయించారు.
ఇదే తరహాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ తదితర శాఖల నిధులతో నడిచే విద్యాసంస్థలు, సొసైటీలు, స్టడీసర్కిళ్లు ఉన్నాయి. కార్మికశాఖ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుస్తున్నాయన్నారు. ఇలా ఎవరికి వారుగా విద్యాసంస్థలు ఉన్నాయి. రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యాసంస్థలు, స్టడీ సర్కిళ్లు వేర్వేరు శాఖల నిర్వహణలో ఉన్నాయని కేసీఆర్ అన్నారు.
ఎవరికి వారుగా విద్యాసంస్థలు నిర్వహించడం వల్ల సమగ్రత లోపించిందని ఆయన పేర్కొన్నారు. దాంతో విద్యార్థులకు అవసరమైన విద్యా, ఉద్యోగ అవకాశాలు పెంచే శిక్షణ అందడం లేదన్నారు. ఎలాంటి ఉద్యోగ అవకాశాలున్నాయో తెలుసుకునేలా వారిని తీర్చిదిద్దడం లేదని చెప్పారు. విద్యార్థులను ఆ పరీక్షల కోసం సిద్ధం చేయడం లేదన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్నిరకాల విద్యాసంస్థలను ఒకే గొడుకు కిందకు తెచ్చే విషయమై సమగ్ర అధ్యయనం చేసి కొత్త విధానం రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి విధాన రూపకల్పన జరగాలని ఆదేశాలు జారీ చేశారు.