ప్రపంచ యుద్ధాలు కీబోర్డులపైనే: కెటిఆర్, ఇష్టంలేని వారిని కెసిఆర్ కలవట్లేదు!
హైదరాబాద్: ప్రస్తుతం సైబర్ యుగంలో ప్రపంచ యుద్ధాలు కీబోర్డులతోనే జరగనున్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం అన్నారు. అందుకే సైబర్ వారియర్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు.
సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మాదాపూర్లో సైబర్ సెక్యూరిటీ వార్షిక సదస్సు జరిగింది. కెటిఆర్ పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం 321 రకాల పౌర సేవలను మీ సేవ పరిధిలో అందుతున్నాయని, ఆరు నెలల్లో వాటిని 400కు విస్తరింప చేస్తామన్నారు.
సైబర్ నేరస్తులు విసురుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. భవిష్యత్ తరాలు ఎదుర్కొనే సమస్యల్లో సైబర్ సెక్యూరిటీయే ప్రధానమైందన్నారు. ఈ క్రమంలో ఆ సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం నిపుణులను తయారు చేస్తుందని చెప్పారు.
ఈ దిశగా ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంనుంచి శిక్షణ ప్రారంభమవుతుందని తెలిపారు. సమస్య నుంచే అవకాశాలు సృష్టించుకుంటూ ముందుకు వెళ్లాలనే లక్ష్యంతో క్రియాశీలంగా తమ ప్రభుత్వం ముందడుగు వేస్తుందన్నారు.
ఇంటర్నెట్ ప్రతి ఒక్కరి జీవితంతో తప్పనిసరి అనుసంధానంగా మారిందని, అదే సమయంలో ఇంటర్నెట్ ఆధారిత నేరాలు, సమస్యలు కూడా పెరిగిపోయాయన్నారు. ప్రపంచంలో పేరెన్నికగన్న సంస్థలు కూడా సైబర్ క్రైమ్ బారినపడడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
భారతదేశంలో కూడా సైబర్ క్రైమ్స్ పెరిగిందని, అయితే వినియోగదారుల వద్ద ఇమేజ్ కోల్పోతామనే భయంతో హ్యాకింగ్ వివరాలను ఆ కంపెనీలు వెల్లడించడం లేదన్నారు. తాను అమెరికా వెళ్లినపుడు మాస్టర్కార్డ్ సీఈవో అజయ్ బంగా సైతం సైబర్ సెక్యురిటీ విషయంలో ఇబ్బందులపై చర్చించారన్నారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ చొరవను వివరిస్తూ సైబర్ సెక్యూరిటీలో నిపుణులను తయారుచేసేందుకు ప్రఖ్యాత సీఆర్ రావు ఇనిస్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకున్నామని, ప్రపంచ ప్రఖ్యాత కార్నెగీ మిలన్ యూనివర్సిటీతో సంప్రదింపులు పూర్తయ్యాయని తెలిపారు.
వచ్చే విద్యాసంవత్సరం లేదా ఆ లోపే కార్నెగీ వర్సిటీ సిబ్బంది ఇక్కడ క్లాసులు ప్రారంభించవచ్చన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు అన్ని సహాయ సహకారాలు అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పటికీ సిద్ధమన్నారు.
గత నెల 9న మీ సేవ ఉన్నతాధికారి మెయిల్ను హ్యాక్ చేసి నైజీరియన్లు రూ.1.5 కోట్ల ఖాతాలను మళ్లించారని చెప్పారు. మాస్టర్ కార్డ్, ఫేస్బుక్ లాంటి సంస్థల సర్వర్లు నిత్యం వేల సంఖ్యలో సైబర్ దాడులకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు.
ఇలా హ్యాకింగ్ భయం వెంటాడుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్ నిపుణుల తయారీ కేంద్రంగా హైదరాబాదును తీర్చిదిద్దడం వల్ల భద్రతతో పాటు ఉపాధి కల్పనకు మార్గం సుగమం అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో సెల్ ఫోన్ ద్వారానే పౌర సేవలను అందించనున్న నేపథ్యంలో సైబర్ భద్రతకు ప్రాధాన్యం పెరిగిందన్నారు.
యువతను పెడదారి పట్టిస్తున్న పోర్నోగ్రఫీని అరికట్టేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందన్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ గౌరవ అధ్యక్షుడు, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ వ్యక్తిగత అవగాహన, భద్రతాపరమైన సలహాలు పాటిస్తే సైబర్ నేరాల్లో చిక్కుకుపోకుండా ఉండగలమన్నారు.
మందకృష్ణకు దొరకని కెసిఆర్ అపాయింటుమెంట్
తెలంగాణ సిఎం కేసీఆర్ పైన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. గత పద్నాలుగు నెలలుగా కేసీఆర్ ను కలవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ తనకు ఇంతవరకు ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు.
తాను తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత్ర పోషించానని, పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ కోదండరాంతో కలసి పని చేశానని, కేసీఆర్కు సైతం అండగా ఉన్నానని, అయినప్పటికీ తనకు అపాయింట్మెంట్ నిరాకరిస్తున్నారని విమర్శించారు.
తనకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేసీఆర్ పైన ఇదే తరహా ఆరోపణలు పలువురు ప్రముఖులు కూడా చేస్తున్నారు. తనకు ఇష్టం లేని వ్యక్తులతో కలవడానికి కేసీఆర్ ఇష్టపడటం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.