బాబుపై పోలీసులకు టీ న్యాయవాదుల ఫిర్యాదు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ న్యాయవాదులు హైదరాబాదులోని సైఫాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ కులాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు మాట్లాడారని, తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు.
ఇదిలావుంటే, చంద్రబాబు వ్యాఖ్యలపై అభ్యంతరం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో యాదవులు వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశఆరు. కరీంనగర్ జిల్లాలోని గుంటూరు పల్లి వద్ద యాదవ కులస్థులు చంద్రబాబు ఫ్లెక్సీ దగ్ధం చేశారు.
యాదవులను కించరపరిచేలా మాట్లాడిన చంద్రబాబు తీరును నిరసిస్తూ గొర్రెల మందతో రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే యాదవ కులస్థులకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
టిడిపి లేకుంటే కెసిఆర్ సిద్ధిపేటలో గొర్రెలను కాసుకుంటూ ఉండేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. దానిపై యాదవ కులస్థులు తెలంగాణలో నిరసనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తమ కులాన్ని కించపరిచే విధంగా చంద్రబాబు వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదు చేస్తున్నారు.