ఖబడ్దార్: ఆంధ్ర నేతలకు టీ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరిక
హైదరాబాద్: ఆంధ్రా నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే ఖబర్దార్ అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన అన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తప్పించుకోలేరని మంత్రి మహేందర్రెడ్డి అన్నారు.
ఓటుకు నోటు కేసులో చట్టం తనపని తాను చేసుకు పోతుందని చెప్పారు. మంగళవారనాడు ఆయన టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడారు. కేసు నుంచి తప్పించుకోవడానికే సెక్షన్-8ను భుజానాకెత్తుకున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడును కేసు నుంచి తప్పించడానికే టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన అన్నారు.
ఆంధ్రోళ్లు ఎంత రెచ్చగొట్టినా మేం రెచ్చిపోమని మంత్రి స్పష్టం చేశారు. ఏపీ నేతలు రెచ్చగొట్టే ధోరణిని మానుకోవాలని హితవుపలికారు. హైదరాబాద్లోని ఆంధ్రా ప్రజలకు తాము అండగా ఉంటామని, ఆంధ్రా, తెలంగాణ ప్రజలు కలిసే ఉంటున్నారని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్నపుడు గవర్నర్ను దేవుడన్నారు, మరి ఇప్పుడు ఎందుకు తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ నుంచే కాకుండా కాంగ్రెసు నుంచి కూడా ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లో చేరారని, మరో ముగ్గురు నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు టిఆర్ఎస్లోకి వస్తారని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీడీపీ, కాంగ్రెస్పార్టీలు ఉండనే ఉండవని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెసు, కాంగ్రెస్ నేతలను చేర్చుకుంటోన్న చంద్రబాబుకు పార్టీ ఫిరాయింపుల చట్టం గుర్తుకు రావడంలేదా అని అడిగారు. తెలంగాణలో ఆంధ్రా నేతలు ఎంతో మంది భూముల కబ్జాకు పాల్పడ్డారని దుయ్యబట్టారు.