ఏజీసీ రోడ్ల మూసివేత: కేటీఆర్ ఆందోళనతో కదిలిన టీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ: హైదరాబాద్లో ఉన్న ఆర్మీ రహదారుల్లో ఉన్న ప్రధానమైన గఫ్ రోడ్డును జూన్ 1 నుంచి మూసేస్తున్నామని రక్షణ శాఖ అధికారులు బుధవారం ప్రకటించిన నేపథ్యంలో ఎంపీ జితేందర్రెడ్డి నేతృత్వంలో రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ను టీఆర్ఎస్ ఎంపీలు శుక్రవారం ఢిల్లీలో కలిశారు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఏజీసీ రోడ్ల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. మే 31 తేదీతో ముగుస్తున్న సడలింపులను మరో ఏడాది పొడగించాలని కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేత నిర్ణయంపై గతంలో రక్షణ మంత్రితో స్వయంగా సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు మే 31 వరకు రోడ్ల మూసివేతను కంటోన్మెంట్ ఉపసంహరించుకుంది. కాగా, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం కోసం కొలతలు తీసుకుంటున్న జీహెచ్ఎంసీ ఇంజినీర్లకు కంటోన్మెంట్ అధికారులు ఆంక్షలు విధిస్తున్నారని పారికర్కు ఫిర్యాదు చేశారు.
దీంతోనే ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణం ఆలస్యమవుతోందని వారు వివరించారు. ఇలా జరగకుండా తగిన ఆదేశాలు జారీ చేసి జీహెచ్ఎంసీ ఇంజినీర్ల తమ పని తాము చేసుకునేలా చూడాలని కోరారు. దీంతో పాటు ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి 34 ఎకరాల స్థలం, రూ.220 కోట్లు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాలని టీఆర్ఎస్ ఎంపీలు కోరారు.
ఈ రోడ్లను మూసివేయాలన్న నిర్ణయం వల్ల కంటోన్మెంట్తో పాటు కంటోన్మెంట్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలు, బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ)లోని అంతర్గత రోడ్ల మూసివేతతో ఈసీఐఎల్ వైపు వెళ్లే వారికి తీవ్రమైన ఇబ్బందులు ఏదురవడంతో పాటు, ట్రాపిక్ జాంలు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లను మూసివేయాలన్న ఆర్మీ అధికారులు నిర్ణయంపై రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంలో కేంద్ర రక్షణ మంత్రి పారికర్తో మాట్లాడాలని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత యంపి జితేందర్ రెడ్డిని గురువారం కోరారు.
తెలంగాణ ఎంపీలంతా కలిసి మనోహర్ పారికర్తో మాట్లాడాలని, రోడ్ల మూసివేతకి ప్రత్యామ్నాయ మార్గాలను సూచించాల్సిందిగా కోరారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేతతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని అంత వరకు ప్రస్తుత మాదిరిగానే కొనసాగించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర రక్షణ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
రోడ్లను మూసివేయాలన్న ఆర్మీ అధికారుల నిర్ణయంతో ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టడానికి పూర్తిస్థాయి అధ్యయనం చేశామని, కంటోన్మెంట్ నుండి ప్రస్తుతం తొమ్మిది మార్గాలు పూర్తిగా మూసివేయడం వల్ల కంటోన్మెంట్ నుండి వెలుపల నుండి నగరానికి చేరుకునే రహదారులకు అదనపు ట్రాఫిక్కు తట్టకునే పరిస్థితిలేదని స్పష్టమైందని అన్నారు.
ఈ మార్గాలను ఇంకా అదనపు ట్రాఫిక్ను ఏమాత్రం తట్టుకునే పరిస్థితులు లేవని తద్వారా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించే అవకాశం ఉందని అన్నారు. పై పరిస్థితుల దృష్ట్యా కంటోన్మెంట్ ప్రాంతం సరిహద్దు నుండి 100 అడుగుల భూమి ఆర్మీ అధికారులు అప్పగిస్తే కొత్తగా రోడ్డును నిర్మించేందుకు కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుందని అప్పటి వరకు ట్రాఫిక్ను యథావిధిగా అనుమతించాలని తెలిపారు.
1934 నుండి ఈ కంటోన్మెంట్ రోడ్లను సాధారణ ప్రజలు ఉపయోగిస్తున్నారని ప్రతిరోజు కనీసం నాలుగు లక్షలకు పైగా వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నాయని ఆయన తలిపారు. కంటోన్మెంట్ రోడ్లను వెంటనే మూసివేయాలన్న ఆర్మీ అధికారుల నిర్ణయం దాదాపు ఐదు లక్షల మందికి పైగా తీవ్ర అసౌకర్యం కలుగుతుందని మంత్రి కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.