ప్రాజెక్టులను అడ్డుకొనేవారిని నిలదీయండి, ఎవరికీ భయపడను: కెసిఆర్
2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుకొంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.
సిద్దిపేట: 2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లకు చేరుకొంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారాయన.ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారిని నిలదీయాలని కెసిఆర్ కోరారు.
సిద్దిపేట జిల్లా కొండపాకలో గొర్కెల పంపిణీ పథకాన్ని మంగళవారం నాడు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. మూడేళ్ళ తర్వాత ఇండియాలో అత్యంత ధనవంతమైన గొల్ల కురుమలు తెలంగాణలో ఉన్నారని చెప్పుకొంటారన్నారు. రానున్న మూడేళ్ళలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్ల, కురుమలు సృష్టించనున్నారని ఆయన చెప్పారు.
1948-56 మధ్య కాలంలో తెలంగాణ ధనిక రాష్ట్రమని నాడు వేల ఉద్యమ సభల్లో తాను చెప్పిన మాటలను ఆయన గుర్తుచేశారు. నాడు తాను చెప్పింది, నేడు నిజమైందన్నారు. ఆర్థిక ప్రగతిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.
2020 నాటికి రాష్ట్ర బడ్జెట్ రూ. 5 లక్షల కోట్లు ఉంటుందన్నారు.గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే తన లక్ష్యమన్నారు కెసిఆర్. గొర్రెల పంపిణీకి కొండపాక నుండి బలమైన పునాది పడిందన్నారు. దాదాపుగా కోటిన్నర గొర్రెలను పంపిణీ చేసినట్టు చెప్పారు.
7.61 లక్షల మంది ధరఖాస్తు చేస్తే 7.18 లక్షల మందికి గొర్రెలు మంజూరయ్యాయన్నారు. ప్రతిరోజూ రాష్ట్రానికి 650 గొర్రెలు హైద్రాబాద్ కు వస్తున్నాయన్నారు. తెలంగాణలో 35 లక్షల గొల్ల కురుమలున్న రాష్ట్రానికి దిగుమతి చేసుకోవడం సరైంది కాదన్నారు. అయితే రానున్న మూడేళ్లలో యాదవులు రాష్ట్రంలో రూ.25 వేల కోట్ల సంపదను సృష్టించనున్నారని చెప్పారు.
రైతులు పిరికిపందల్లా ఆత్మహత్యలు చేసుకోకూడదని ఆయన సూచించారు. ప్రాజెక్టులను అడ్డుకొనేందకు అడుగడుగునా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 20 రోజుల్లోనే ఐదు కేసులను వేశారని చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకొనేందకు ప్రయత్నించేవారిని నిలదీయాలని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టులు అడ్డుకొనేవారు ఎవరో ప్రజలకు తెలుసునన్నారు. కోటి ఎకరాలకు నీటిని ఇస్తామన్నారు.
తమ ముందున్న లక్ష్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన పరోక్షంగా విపక్షాలపై ఆరోపణలు గుప్పించారు. తమ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.అయితే ఎవరెన్ని చేసినా తమ ఏకాగ్రతను దెబ్బతీయలేరన్నారు. అంతేకాదు తాను ఎవరికీ కూడ భయపడనని చెప్పారు.