హైద్రాబాద్ వద్దంటే తెలంగాణ ఎప్పుడో వచ్చేది, కూల్చుదామా?: కెసిఆర్
హైదరాబాద్: రాజధాని హైదరాబాదును వద్దనుకుంటే పన్నెండేళ్ల క్రితమే తెలంగాణ రాష్ట్రం వచ్చేదని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత హైదరాబాద్పై ఆశలు వదులుకుని ఎప్పుడో ప్రత్యేక రాష్ట్రం వచ్చి వుండేదన్నారు.
తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాదుపై రాజీ పడలేదు కాబట్టే పదేళ్లు ఆలస్యమైనా, నూతన రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నామన్నారు. అందువల్లే అనుమతి లేని కట్టడాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. చావుమీదకు తెచ్చుకొని మరీ హైదరాబాదును దక్కించుకున్నామన్నారు.
తన చాంబర్లో తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపిన కేసీఆర్.. ఆంధ్రా నేతలు హైదరాబాదును పొరుగు నగరంగానే చూశారని చెప్పారు. ఈ అస్తవ్యస్త పరిస్థితిని చక్కదిద్దాల్సి వుందని, నగరాన్ని తీర్చిదిద్దుకునే దిశగా ప్రజా ప్రతినిధులు, అధికారులు అలసత్వాన్ని వీడాలని సూచించారు.
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఎ, వాటర్ బోర్డు వంటి సంస్థలు తమ పనితీరు మెరుగుపరచుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. అక్రమ నిర్మాణాల విషయంలో ఏ దారిలో వెళితే మేలు కలుగుతుందో ఆలోచించి ముందడుగు వేయాలని, భవిష్యత్తులో అటువంటి ప్రయత్నాలు జరగకుండా, ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అక్రమ నిర్మాణాల విషయంలో క్రమబద్ధీకరణ చేయాలా లేక కూల్చివేయాలా... అధ్యయనం చేయాలని కెసిఆర్ అధికారులకు సూచించారు. కొత్తగా విస్తరిస్తున్న హైదరాబాద్ నగరం క్రమపద్ధతిలో ఉండాలన్నారు. ఉమ్మడి పాలనలో ఆగమై, అస్తవ్యస్తంగా తయారైన నగరాన్ని చక్కదిద్దుకోవాలన్నారు.
చావుమీదికి తెచ్చుకుని మరీ హైదరాబాద్ దక్కించుకున్నామని, అలాంటి నగరాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవాలన్నారు. హైదరాబాద్తోపాటు ఉమ్మడి పాలకులు అవలంభించిన విధానాల పాపాలుకూడా వారసత్వంగా వచ్చాయన్నారు.
నగరంలో అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన కట్టడాలపై సమీక్షించాలని, భవిష్యత్తులో ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు లేకుండా కొత్తగా భూమి, భవనాల నిర్మాణ విధానాన్ని పటిష్ఠంగా తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ గురించే చర్చ జరిగిందన్నారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఇవ్వడానికి అభ్యంతరం లేదని ఆంధ్ర నాయకత్వం కూడా అంగీకరించిందని, కానీ నేను ఒప్పుకోలేదన్నారు. హైదరాబాద్ విషయంలో రాజీపడేది లేదన్నారు.
హైదరాబాద్ను ఆంధ్రపాలకులు మనది అని అనుకోలేదని, భావితారాల గురించి వారు ఆలోచించలేదన్నారు. అందుకే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా ఉన్నాయన్నారు. ఎక్కడ చూసినా పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమంగా వెలిసిన నిర్మాణాలు, అనుమతులు లేకుండా కట్టిన కట్టడాల గురించి సమీక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. వాటిని కూలగొట్టడం ఉపయోగమా? క్రమబద్ధీకరించడం ఉపయోగమా? వాటి పర్యవసానాలు ఏమిటి? అనే విషయంపై అన్ని కోణాల్లో విస్తృతంగా అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాలన్నారు.
భూముల క్రమబద్ధీకరణ విషయంలో కూడా ఇలాంటి ప్రయత్నం జరగాలని చెప్పారు. భవిష్యత్తులో మళ్ళీ అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు జరగకుండా పటిష్టమైన విధానం రూపొందించాలని, బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్పై సరైన నిర్ణయం తీసుకోవడానికి అధికారులు తగు సిఫారసులు చేయాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం ల్యాండ్ అండ్ బిల్డింగ్ పాలసీని తీసుకురావాలసిన అవసరం ఉందని, హైదరాబాద్ నగరంలో గృహనిర్మాణ రంగం బాగా అభివృద్ధి చెందుతుందని, బిల్డర్లను కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు.