వైఎస్ షర్మిల జపం, విజయమ్మ సైతం దూరం: చేతులెత్తేసిన జగన్ పార్టీ
తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చేతులెత్తేసింది. పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాటలు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
హైదరాబాద్: వైఎస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తెలంగాణలో పూర్తిగా చేతులెత్తేసింది. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావడం కనుచూపు మేరలో లేదంటూ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి కార్యకర్తల ఉత్సాహంపై నీళ్లు చల్లారు.
హైదరాబాద్ శివారులోని చంపాపేటలో గురువారం జరిగిన పార్టీ తెలంగాణ శాఖ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 2019లో తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నించి అధికారం చేపట్టే దిశగా అడుగులు వేస్తామని ఆయన చెప్పారు.
అయితే, పార్టీని ప్రజల్లోకి తీసుకుని తెలంగాణ పార్టీ పగ్గాలను జగన్ సోదరి వైఎస్ షర్మిళకు అప్పగించాలనే డిమాండ్ సమావేశంలో వచ్చింది. తెలంగాణలో పార్టీ ఉనికిని చాటుకోవాలంటే షర్మిలనే సరైన నాయకురాలని, ఆమె సారథ్యంలోనే పని చేస్తామని పలువురు నాయకులు డిమాండ్ చేశారు.
ఉత్సాహం కరువు...
తెలంగాణలోని పలు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సమావేశానికి తరలి వచ్చారు. అయితే, వారిలో ఉత్సాహం కనిపించ లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు సమావేశానికి రాకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ ప్లీనరీ తొలిసారి నిర్వహించిన ప్లీనరీ కాబట్టి వైఎస్ జగన్ హాజరై ఉంటే బాగుండేదని, ఉత్సాహం కనిపించేదని అంటున్నారు.
విశాఖ మహాధర్నాలో జగన్
వైఎస్ జగన్ గురువారం విశాఖపట్నంలో భూ కుంభకోణాలపై నిరసనగా చేపట్టిన మహా ధర్నాలో పాల్గొన్నారు. దాని వల్ల ప్లీనరీకి హాజరుకాలేదు. జగన్ రాకపోయినా షర్మిల లేదా వారి తల్లి వైఎస్ విజయమ్మ వచ్చినా ఉత్సాహం కనిపించేదనే అబిప్రాయం వ్యక్తమవుతోంది.
షర్మిల నాయకత్వం కోసం...
సమావేశంలో నాయకులు షర్మిల జపం చేశారు. తెలంగాణలో పార్టీకి షర్మిల నాయకత్వం వహించాలంటూ నాయకులు తమ ప్రసంగాల్లో డిమాండ్ చేశారు. తెలంగాణ పార్టీ శాఖ అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డి బాగా పని చేస్తున్నప్పటికీ, షర్మిల గౌరవ అధ్యక్షురాలిగా ఉండాలని, తెలంగాణలో పర్యటిస్తే పార్టీ బలోపేతం అవుతుందని వారు అన్నారు.
ఇంకేం ఉంది....
పార్టీ తెలంగాణలో అదికారంలోకి రావడం కల్ల అనే పద్ధతిలో పార్టీలోని ముఖ్య నాయకుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడిన తర్వాత నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుందనేది కలలో మాటనే. తెలంగాణలో పాదయాత్ర చేసిన షర్మిల అకస్మాత్తుగా పార్టీ వ్యవహారాలకు దూరం కావడంం చర్చనీయాంశమైంది. తల్లి విజయమ్మను, సోదరి షర్మిలను జగన్ రాజకీయాలకు దూరంగా ఉంచాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.