టీఆర్ఎస్ఎల్పీలో వైసీపీ విలీనం: తెలంగాణలో జగన్ పార్టీ ఖతం
హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విలీనమైంది. ఈ మేరకు టీఆర్ఎస్ ఎల్పీలో వైసీ ఎల్పీని విలీనం చేస్తూ శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన బులిటెన్ను శానససభ అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
2014లో జరిగిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి వైసీపీ తరుపున ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు గెలుపొందారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వైసీపీ టికెట్పై గెలిచిన తాటి వెంకటేశ్వర్లు, బానోతు చందూలాల్ తొలుతు టీఆర్ఎస్లో చేరారు.
కాగా, ఇటీవలే ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు, వైసీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో పాటు వైసీపీ నేతలంతా టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరికలతో తెలంగాణలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయింది.
దీంతో టీఆర్ఎస్లోకి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురూ తమను టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తించాలని స్పీకర్ మధుసూధనాచారికి లేఖ రాశారు. వైసీపీ ఎమ్మెల్యేల వినతిని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ వారిని టీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తూ అసెంబ్లీ బులిటెన్ విడుదల చేశారు.