14 నెలల తర్వాత ఇళ్లకు తెలుగు ప్రొఫెసర్లు: మాట్లాడేందుకు నిరాకరణ
హైదరాబాద్: లిబియాలోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేరలో 14 ఏళ్ల పాటు ఉండి ఇటీవలే విడుదలయిన తెలుగు ప్రొఫెసర్లు గోపీకృష్ణ, బలరాం కిషన్లు హైదరాబాద్లోని తనృమ ఇళ్లకు చేరుకున్నారు. మొదట లిబియా నుంచి ఢిల్లీ చేరుకున్న వారు అక్కడ నుంచి ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయంలో హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు.
వారు వస్తున్న విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు కూడా ముందుగా తెలియజేయలేదని సమాచారం. ఢిల్లీ నుంచి ప్రొఫెసర్లకు తోడుగా విదేశాంగ శాఖ అధికారులు కూడా వచ్చారు. నిరుడు జూలై 29న కర్ణాటకకు చెందిన మరో ఇద్దరు భారతీయులతో పాటు వీరిని కూడా ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే.
వీరంతా లిబియాలోని సిర్టే యూనివర్శిటీలో ప్రొఫెసర్లుగా పనిచేసేవారు. కన్నడిగులను ముందే వదిలిపెట్టిన ఉగ్రవాదులు గోపీకృష్ణ, బలరాం కిషన్లను మాత్రం ఏడాదికి పైగా తమ ఆధీనంలో ఉంచుకున్నారు. వారితో ఉగ్రవాదులకు పాఠాలు చెప్పించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.
మీడియాతో మాట్లాడేందుకు తెలుగు ప్రొఫెసర్లు నిరాకరించారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వర్షం కురిపించారు. అయినా వారు సమాధానాలు చెప్పలేదు. ప్రభుత్వాలు, మీడియా తమకు మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలని చెప్పారు.
తాము ఏమీ మాట్లాడలేమని, తర్వాత అన్నీ వివరంగా చెబుతామని వారు అం్టున్నారు. కిడ్నాప్ చేసినవారు వదిలేశారా, లేదా తప్పించుకున్నారా అని అడిగితే కూడా ప్రొఫెసర్లు మాట్లాడలేదు. కొద్ది రోజుల తర్వాత అన్నీ వివరంగా మాట్లాడుతామని అన్నారు.
మీడియా ప్రతినిధుల ప్రశ్నలతో విసిగిపోయిన ఓ ప్రొఫెసర్ మాత్రం - తాను విదేశాంగ శాఖ కస్టడీలో ఉన్నానని, ఏమీ మాట్లావద్దని మంత్రిత్వ శాఖ ఆదేశించిందని చెప్పారు.