జడ్పీ సమావేశం రసాభాస: కొట్టుకున్న కాంగ్రెస్, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, రేపు బంద్
మహబూబ్నగర్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రసాభాస చోటు చేసుకుంది. పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం నేతలకు లేదంటూ టిఆర్ఎస్ నేతలు మండిపడటంతో వివాదం మొదలైంది.
అయితే తర్వాత కాసేపటికి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతలకు సిగ్గూశరం లేవని వ్యాఖ్యానించడంతో వివాదం కాస్తా తారస్థాయికి చేరుకుంది. ఓ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు చెంపదెబ్బ కొట్టడంతో తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
ఆ తర్వాత ఎమ్మెల్యే బాలరాజు జడ్పీ ఛైర్మన్ పోడియం వద్ద బైఠాయించారు. తనను కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా దూషించారని, ఆయనపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా, తాను మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్పీ ఛైర్మన్ అదుపుచేయాలని ఎంతగా ప్రయత్నించినా ఉద్రిక్తత తగ్గలేదు. ఇది ఇలా ఉండగా, తోపులాటలో ఎమ్మెల్యే బాలరాజుకు గాయాలయ్యాయి.
ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు ఎమ్మెల్యేలకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
దాడి అమానుషం జానారెడ్డి, ఉత్తమ్
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిపై బాలరాజు దాడి చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క ఖండించారు. దాడి అమానుషమని అన్నారు. బాలరాజు దాడి చేసిన ఘటనపై స్పీకర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. టిఆర్ఎస్ ఆగడాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. దాడి విషయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని అన్నారు. శనివారం మహబూబ్నగర్ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు.