నిరుద్యోగ ర్యాలీ: ఓయూలో ఉద్రిక్తత, ఇందిరా పార్క్ పోలీస్ దిగ్బంధం
నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
హైదారాబాద్: నిరుద్యోగుల ర్యాలీ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తెలంగాణ నిరుద్యోగ సమస్యపై బుధవారం ర్యాలీ నిర్వహించాలని జేఏసీ ఛైర్మన్ కోదండరామ్ పిలిపునిచ్చిన ఓయూ విద్యార్థులు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు.
ఉస్మానియాలో ఉద్రిక్తత
బుధవారం ఉదయం పదిగంటల సమయంలో ఉస్మానియా విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీని లా కళాశాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మరోపక్క నిజాం కళాశాలలో విద్యార్థులు తగతులను బహిష్కరించి ర్యాలీ చేపట్టారు. దీంతో అక్కడ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీస్ దిగ్బంధంలో ఇందిరాపార్క్
ఇందిరాపార్క్ వద్దకు వెళ్లే ధర్నాచౌక్ రహదారిని పోలీసులు మూసివేశారు. ఇక్కడ భద్రతకు ఐదుగురు ఏసీపీలు, 20 మంది సీఐలు, 200 మంది పోలీసులను నియమించారు. ఇక్కడకు అనుమతి లేకుండా ఎవరినీ రానీయడం లేదు.
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఉద్రిక్తత
సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలతోపాటు నిరుద్యోగులు కూడా తరలివచ్చారు. అనంతరం అక్కడినుంచి ర్యాలీకి వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే... ఓ యువతి తన చున్నీతో ఉరేసుకునేందుకు ప్రయత్నించింది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. కాగా... ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా పలువురు నినాదాలు చేశారు.
అనుమతి లేదంటూ.. డీసీపీ
కాగా, ర్యాలీ నిర్వహించతలపెట్టిన నేపథ్యంలో కోదండరాంను బుధవారం తెల్లవారు జామున పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా తూర్పుమండల డీసీపీ రవీంద్ర మాట్లాడుతూ ఎటువంటి ర్యాలీలకు అనుమతి లేదని తెలిపారు.
కోదండరాం అరెస్ట్
అంతకు ముందు కోదండరామ్ను కలిసేందుకు వచ్చిన జేఏసీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సీపీఎం నేతలను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎల్బీనగర్లో జేఏసీ అధ్యక్షుడు కేవీ రంగారెడ్డిని పోలీసుల అరెస్టు చేశారు. ఆయన ర్యాలీకి బయల్దేరుతుండగా కొత్తపేటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.