అది కచ్చితంగా హత్యే, సంచలన విషయాలు వెల్లడించిన శిరీష బాబాయి
బ్యూటీషియన్ శిరీష మృతిపై బెంగళూరులో ఉంటున్న ఆమె బాబాయి శ్రీనివాస్ రావు స్పందించారు. కేసు విచారణ సరిగా జరగలేదని పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారాయన.
హైదరాబాద్: సంచలనం సృష్టిస్తున్న శిరీష ఆత్మహత్య కేసులో మీడియాలో వస్తున్న కథలు బాధాకరంగా ఉన్నాయని శిరీష కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవాలు వదిలేసి.. తమ బిడ్డ క్యారెక్టర్పై చెడు ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు.
చదవండి: టీవీ నటి కిడ్నాప్, ఆపై అత్యాచారం.. అనంతపురంలో కీచకుడి అరెస్టు!
శిరీషను హత్య చేశారనేదీ తమ అనుమానం కాగా.. ఆత్మహత్యగా ముగింపు పలకడం వెనుక ఏం జరిగిందనేదీ తేలాల్సిన అవసరం ఉందన్నారు. శిరీష మృతిపై బెంగళూరులో ఉంటున్న ఆమె బాబాయి శ్రీనివాస్ రావు స్పందించారు. కేసు విచారణ సరిగా జరగలేదని పోలీసుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారాయన.
ఆ లొకేషన్ పోలీస్ క్వార్టర్స్ కాదు...
శిరీషది ముమ్మాటికి హత్యేనన్నారు ఆమె బాబాయి శ్రీనివాస్ రావు. 1.58 నిమిషాలకు శిరీష తన భర్తకు వాట్సప్లో లొకేషన్ షేర్ చేసిందని పోలీసులు చెబుతున్నారని, ఆ లొకేషన్ను పరిశీలిస్తే.. కమిషనర్ చెప్పినట్లు పోలీస్ క్వార్టర్స్ కాకుండా అక్కడి నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశాన్ని అది చూపిస్తోందని ఆయన తెలిపారు.
తలపై అంత గాయమెలా అయింది?
దీనిని బట్టి చూస్తుంటే అసలు శిరీష పోలీస్ క్వార్టర్స్కే వెళ్లలేదని, వీళ్లందరూ ఓ రిసార్ట్స్లో కలుసుకున్నట్లుగా అర్థమవుతుందని శిరీష బాబాయి చెప్పారు. శిరీష తలపై గాయం జుట్టు పట్టుకొని లాగితే అయ్యింది కాదని, బలంగా కొట్టడం ద్వారా అయిందన్నారు. జుట్టుపట్టుకొని లాగితే తలకు అంతపెద్ద గాయం అవుతాదా? అని ప్రశ్నించారు.
శిరీషను కొట్టి చంపేశారు...
‘శిరీష వారి నుంచి తప్పించుకునేందుకు కారు దిగి పారిపోయింది. ఈ క్రమంలో ఎక్కడో ఏదో చెట్టుకింద ఉండి తన లొకేషన్ను భర్తకు షేర్ చేసింది. పారిపోయిన శిరీషను పట్టుకొని బలంగా కొట్టి చంపేశారు. ఆ తరువాత రాజీవ్, శ్రవణ్, ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ముగ్గూరు కలిసి డ్రామా ఆడి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు..' అని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు.
ఉరేసుకునే అవకాశమే లేదు...
శిరీష మృతిపై అటు పోలీసులు, ఇటు మీడియా వాళ్లు అనేక వాదనలు వినిపిస్తున్నారు. అపార్ట్మెంట్లో పైకి వెళ్లి ఉరివేసుకుందని చెబుతున్నారు.. శిరీష ఎత్తు 5.11 అడుగులు. ఈ లెక్కన రూమ్లో కాట్ ఎత్తు, ఫ్యాన్ ఎత్తును పరిశీలిస్తే.. ఉరి వేసుకునే అవకాశమే లేదు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక్క సిసి టీవీ ఫుటేజి దొరకలేదా?
ఈ కేసులో ఇప్పటి వరకు ఒక్క సిసి టీవీ ఫుటేజీ కూడా దొరక్కపోవడం తమకు అనుమానం కలిగిస్తోందని శిరీష బాబాయి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. ఇవన్నీ చూసే తాము శిరీషది హత్యగా నిర్ధారణకు వచ్చామని చెప్పారు. ఇప్పటికైనా నిజాన్ని వెలికి తీయాలని కోరుతున్నామన్నారు. దోషులను వదిలేసి, తమ అమ్మాయిని తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేంటి ఆ సెటిల్మెంట్?
ఈ కేసులో బాధితురాలైన శిరీషనే ఇంకా ఇంకా బ్లేమ్ చేస్తున్నారని.. కేసులో ప్రధాన నిందితులైన రాజీవ్, తేజస్వినిల బ్యాక్గ్రౌండ్ను ఎందుకు బయటకు తీయడం లేదని శ్రీనివాస్ రావు ప్రశ్నించారు. తేజస్విని, రాజీవ్, శిరీష ముగ్గురూ కలిసి సెటిల్మెంట్ కోసం స్టేషన్కు వెళ్లారంటున్నారు. అసలు ఆ సెటిల్మెంట్ ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇప్పటికైనా నిజాలు వెల్లడించండి...
శిరీష కర్ణాటకలో పుట్టిందని, చిన్నప్పటి నుంచి తన వద్దే పెరిగిందని ఆమె బాబాయి చెప్పారు. ఆమె వ్యక్తిత్వం తనకు బాగా తెలుసంటూ.. ‘మా అమ్మాయి ఫైర్ బ్రాండ్. శిరీష చాలా ధైర్యవంతురాలు.. ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు... ఎదిరించి బతికే మనస్తత్వం శిరీషది..' అని ఆయన తెలిపారు. ‘జూన్ 7వ తేదీ శిరీష పుట్టిన రోజు.. ఆ రోజే ఆమెతో చివరిసారిగా మాట్లాడా'నని చెప్పారు. ఇప్పటికైనా డ్రామాలు కట్టిపెట్టి నిజాన్ని వెల్లడించాలని శిరీష బాబాయి శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు.