నేరెళ్ల ఘటన: కెసిఆర్ అలా, సెగ తాకితే గానీ కెటిఆర్ దిగిరాలేదా....
నేరెళ్ల సంఘటన వేడి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వానికి బాగానే తాకినట్లు ఉంది. స్థానిక శాసనసభ్యుడైన మంత్రి కెటి రామారావు ఉక్కిరిబిక్కిరైనట్లే కనిపిస్తున్నారు. దాంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగి
సిరిసిల్ల: నేరెళ్ల సంఘటన వేడి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వానికి బాగానే తాకినట్లు ఉంది. స్థానిక శాసనసభ్యుడైన మంత్రి కెటి రామారావు ఉక్కిరిబిక్కిరైనట్లే కనిపిస్తున్నారు. దాంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనిపిస్తున్నారు.
ఇసుక లారీలకు నిప్పు పెట్టిన ఘటనపై ముఖ్యమంత్రి కెసిఆర్ తొలుత చాలా తీవ్రంగా ప్రతిస్పందించారు. లారీలకు నిప్పు పెడితే ఊరుకుంటారా అని అడిగారు. దళితులని నుదుటి మీద రాసి ఉంటుందా అని అడిగారు. ఈ మాటలపై తీవ్ర నిరసన వ్యక్తమైంది.
తన నియోజకవర్గంలో ఘటన జరిగినప్పటికీ కెటి రామారావు నోరు మెదపలేదు. నేరెళ్లకు చెందిన కొంత మందిని పోలీసులు అరెస్టు చేసి, తీవ్రంగా హింసించారనేది ఆరోపణ. చిత్రహింసలకు గురైనవారు ఆస్పత్రిలో చేరారు. వారు ఇప్పటికీ కోలుకున్న దాఖలాలు లేవు.
అది నిజమేనా....
నేరెళ్ల ఘటనలో పోలీసులు కొంత మందిని అరెస్టు చేయడం, వారిని కస్టడీకి తీసుకోవడం తనకు తెలియదని కెటి రామారావు అంటున్నారు. ఈ విషయాన్ని ఎంత వరకు నమ్మవచ్చుననేది ప్రశ్న. ఈ వివాదం చెలరేగుతున్న సమయంలోనే, అది కూడా కెసిఆర్ ఘటనపై మాట్లాడిన తర్వాత కెటిఆర్ తన నియోజకవర్గంలో పర్యటించారు. అటువంటప్పుడు ఆయనకు తెలియదంటే ప్రజలు నమ్ముతారా అనేది ప్రశ్న.
మీరా కుమార్ పర్యటన తర్వాత.....
లోకసభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నేరెళ్లను సందర్శించి, బాధితులను పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఇందుకేనా అన్నారు. దాంతో అది జాతీయ సమస్యగా ముందుకు వచ్చింది. ఆ సమయంలోనైనా కెటిఆర్ స్పందించారా, అంటే లేదు. సంఘటన తీవ్రతను సరే, ఎదరువుతున్న వ్యతిరేకతను ఆయన తక్కువ అంచనా వేసుకుని ఉంటారని అనుకోవాల్సి ఉంటుంది.
ఓ వైపు రగులుతుంటే....
నేరెళ్ల ఘటన దుమారం చెలరేగుతున్న సమయంలోనే కెటి రామారావు హైదరాబాదులో ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. బహుశా, అది చేనేతకు సంబందించింది కాబట్టి చేనేత రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉంది కాబట్టి దాని ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ, నేరెళ్ల ఘటన విషయంలో ఇంత కాలం ఉదాసీనత ప్రదర్శించడానికి కారణమేమిటనేది ఆయనకే తెలుసు. తనకు తెలియదనే మాట ఎవరూ నమ్మరు. అప్పటికే ప్రతిపక్షాల నాయకులు నేరెళ్ల వెళ్లి బాధితులను పరామర్శించారు.
తీవ్రమైన తర్వాత....
నేరెళ్ల ఘటన తీవ్రతను గమనించిన తర్వాత, దాని సెగ తగిలిన తర్వాత కెటి రామారావు అక్కడ పర్యటించి బాధితులను పరామర్శించారు. కెటిఆర్ పరామర్శ బాధితులకు న్యాయం చేస్తుందా అనేది ప్రశ్న. సంఘటనపై డిఐజి స్థాయి అధికారితో విచారణ జరిపిస్తున్నామని, నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నేరెళ్ల పర్యటన తర్వాత ఆయన చెప్పారు.
ఇసుక రవాణాపై చాలానే చెప్పారు....
మధ్య మానేరులో ఇసుకును తోడివేస్తున్న వ్యవహారంపై కెటిఆర్ చాలానే చెప్పారు. ఇసుక మాఫియా అంటే ఊరుకునేది లేదని పనిలో పనిగా ప్రతిపక్షాలను, ఆ మాట అంటున్న ప్రజాస్వామ్యవాదులను ఆయన హెచ్చరించారు కూడా. కేవలం టూరిస్టుల్లా వచ్చి పోతూ ఘటనను జాతీయస్థాయి సమస్యగా చిత్రీకరించాలని చూస్తున్న విపక్షాల కుట్రలు బహిర్గతమయ్యాయని వ్యాఖ్యానించారు. సిరిసిల్ల ప్రజలనుంచి తనను దూరంచేయాలన్న ప్రతిపక్షాల కుటిల బుద్ధిని ప్రజలే తిప్పికొడుతారన్నారు.
కెసిఆర్ అలా అంటే....
కెసిఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు కెటిఆర్ చెప్పిన మాటలకు పొంతన లేదు. లారీలకు నిప్పు పెడితే పోలీసులు ఊరుంటారా అని ప్రశ్నించిన కెసిఆర్ లారీల కింద పడి ప్రజలు చనిపోతున్న విషయంంపై మాత్రం మాట్లాడలేదు. లారీలకు నిప్పు పెట్టిన ఘటన ఆవేశంలో జరిగిందని కెటిఆర్ అంటున్నారు. ఇంతగా సెగ తగిలితేనే గానీ ప్రభుత్వం కదలదా అనేది ప్రశ్న.
అప్పుడే స్పందించి ఉంటే....
సంఘటనపై కెటి రామారావు వెంటనే స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అతి విశ్వాసం ఆయనను అలా స్పందించకుండా చేసిందని అనుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంపైనే కాకుండా, తనపై కూడా వ్యతిరేకత పెల్లుబుకేవరకు ఆయన మాట్లాడలేదంటే ఏమనుకోవాలనే ప్రశ్న ఉదయిస్తోంది.