వదిలేసి వచ్చి సహజీవనం: అనుమానంతో ప్రేయసి హత్య, తాను ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్లోని కూకట్పల్లిలో అమ్మానాన్నలు విగతజీవులైన నేపథ్యంలో ఏడాది బాలుడు గుక్క పట్టి ఏడ్చి దిక్కులేనివాడైన విషాద సంఘటనలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. మృతి చెందిన ఇద్దరు కూడా కర్ణాటకకు చెందినవారని హైదరాబాద్ వచ్చి కూకట్పల్లి అద్దె ఇంట్లో సహజీవనం చేస్తున్నారని, వారికి ఏడాది బాలుడు ఉన్నాడని వెలుగు చూసింది.
అతను కర్ణాటకలోని కోలార్ జిల్లా రోనూరు మండలం శ్రీనివాసపురానికి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి కాగా, ఆమె కర్ణాటకకే చెందిన మాండ్యా జిల్లా చిక్కుపల్లికి చెందిన మీనా అని తెలుస్తోంది. మంజునాథ్కు అప్పటికే పెళ్లయింది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మీనాకు ఎనిమిదేళ్ల క్రితం శ్యాంరాజు అనే వ్యక్తితో వివాహమైంది. ఆమెకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు.
ఆమె నాలుగేళ్ల క్రితం భర్త నుంచి దూరమైంది. అప్పట్లో కొరియర్ బాయ్గా పని చేస్తున్న మంజునాథ్కు, మీనాకు పరిచయమైంది. అది ప్రేమగా, వివాహేతర సంబంధంగా మారి, చివరికి సహ జీవనానికి దారి తీసింది. ఇద్దరూ తమ తమ ఇళ్లలో అబద్ధాలు చెప్పి, ఉద్యోగం పేరిట ఒక్కో నగరంలో కొన్నాళ్లు గడుపుతూ వచ్చారు. రెండేళ్లుగా ఇలాగే చేశారు. వారికి ఏడాది క్రితం ఒక మగ పిల్లాడు పుట్టాడు.
అలా మంజునాథ్, మీనా జంట ఐదు నెలల క్రితం ఈ జంట హైదరాబాద్ చేరుకుంది. వీరు కూకట్పల్లి కమలా ప్రసన్ననగర్లో ఓ పెంట్ హౌస్లో అద్దెకు దిగారు. మంజునాథ్ ఓ ఎలక్ట్రానిక్స్ షూ రూమ్లో సేల్స్మన్గా పనిచేస్తుండగా, మీనా నిజాంపేట్లోని ఓ షోరూంలో సేల్స్గర్ల్గా పని చేస్తోంది. బాలుడిని ఇంటి సమీపంలో ఉన్న ఓ ప్లే స్కూల్లో ఉంచి వీరు విధులకు వెళ్లేవారు.
కాగా, రెండు రోజులుగా ఇంటి ముందు పడేసిన పాల ప్యాకెట్లు అలాగే ఉండటంతో ఇంటి యజమానికి అనుమానం వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం పెంట్హౌస్ వద్దకు వెళ్లి చూడగా బాలుడి మూలుగు వినిపించింది. తలుపుకొట్టినా స్పందన లేకపోవడంతో ఇంటి యజమాని స్థానికుల సాయంతో బలప్రయోగంతో గది తలుపు తెరిచారు. తలుపు వద్ద రక్తపు మడుగులో మీనా మృతదేహం పడి ఉంది. చీరతో ఉరి వేసుకున్న మంజునాథ్ దేహం కనిపించింది.
మంజునాథ్ మీనాను చంపి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. అక్కడ లభించిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది కన్నడంలో రాసి ఉంది. ‘నిన్ను నమ్మి భార్యా పిల్లలను వదిలేసి వస్తే నన్ను మోసం చేశావు. మన ప్రేమ బలపడాలంటే మనద్దరి చావే శరణ్యం' అని అందులో ఉంది. దీన్ని బట్టి చూస్తే మీనా మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుందనే అనుమానంతోనే ఆమెను చంపి, అతను ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చునని అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే, మీనా తన కుమారుడు కౌశిక్ను తల్లి ఈశ్వరమ్మ వద్ద ఉంచి హైదరాబాద్లో ఉద్యోగం పేరిట మంజునాథ్తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మీనా, మంజునాథ్ బుధవారం రాత్రే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బయటికి వచ్చే దారిలేక ఏం జరిగిందో తెలియక ఏడాది చిన్నారి నాలుగు గోడల నడుమే, శవాల మధ్యే ఉన్నాడు. ఆకలికి ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయాడు. స్థానికులు బాలుడికి మంచినీరు తాగించి ప్రాథమిక వైద్యం అందించి సంరక్షణ కొరకు కేపీహెచ్బీ కాలనీలోని ఓ బేబీ కేర్ సెంటర్కు తరలించారు.