టెక్కీ ఇంట్లో చోరీ: ప్లాస్టిక్ కవర్లో చుట్టి శిశువుని బావిలో పడేశారు
హైదరాబాద్: సికింద్రాబాదులోని ఓ సాఫ్ట్వేర్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంటి తాళాలు పగులగొట్టి దొంగతానికి పాల్పడిన సంఘటన సికింద్రాబాదులోని తిరుమలగిరి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. తిరుమలగిరిలోని వెంకటేశ్వర కాలనీ ప్లాట్నెంబర్ 40 లో నివాసం ఉంటున్న డి.కె. చైతన్య వృతి రీత్యా స్టాప్వేర్ ఇంజనీర్.
ఈ నెల 27వ తేదీన చైతన్య తల్లి ఊరికి వెళ్లగా చైతన్య వృత్తి రీత్యా గురువారం రాత్రి ఇంటికి తాళం వేసి డ్యూటీకి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారు జామున తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా ల్యాప్టాప్, 20 తులాల వెండి, 4 తులాల బంగారం ఇతర వస్తువులు కనిపించలేదు.
దొంగతనం జరిగినట్లు గుర్తించిన ఆయన వెంటనే తిరుమలగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, రంగారెడ్డి జిల్లా ధారూర్ మండలం అల్లిపూర్లో అమానవీయమైన ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును ప్లాస్టిక్ కవర్లో చుట్టి బావిలో పడేశారు. శిశువు ఏడుపు విని స్థానికులు రక్షించారు. పోలీసులకు సమాచారం అందించి వారికి అప్పగించారు.