సినీ నిర్మాత పేరుతో నగలతో ఉడాయించిన యువకుడు
తాను సినీ నిర్మాతనంటూ ఓ వ్యక్తి నగల దుకాణంలోంి నెక్లెస్ తీసుకుని పరారయ్యాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేసి, బంగారం స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: సినీ నిర్మాతనంటూ నమ్మించి బంగారు నగల దుకాణంలో 55 గ్రాముల నెక్లెస్ తీసుకొని పరారైన యువకుడిని హైదరాబాదులోని సైదాబాద్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 1.67 లక్షల విలువగల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
చంపాపేట రెడ్డి కాలనీలో మాధవీలత శ్రీ స్వర్ణ జువెలరీ పేరుతో బంగారు, వెండి ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నారు. బీటెక్ పూర్తిచేసిన మహబూబాబాద్ జిల్లా తంగెళ్లపల్లికి చెందిన టి. నాగేంద్రకుమార్ వర్మ ఫేస్బుక్ ద్వారా మాధవీలతకు సినీ నిర్మాతగా పరిచయమయ్యాడు.
డిసెంబర్ 12వ తేదీన ఆమెకు ఫోన్ చేసి బంగారు నెక్లెస్ కావాలని చెప్పాడు. 15వ తేదీన షాపుకు వెళ్లి నెక్లెస్ తీసుకున్నాడు. పెద్ద నోట్ల రద్దుతో డబ్బు తీసుకురాలేదని.. ఆన్లైన్లో ఆమె ఖాతాకు బదిలీ చేస్తున్నట్టు నటించాడు. నగదు ట్రాన్స్ఫర్ అయినట్టు మీ ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుందని నమ్మించి నెక్లెస్ తీసుకొని ఉడాయించాడు.
మూడు గంటలైనా మెసేజ్ రాకపోవడంతో మాధవీలత నాగేంద్రకుమార్కు ఫోన్ చేసినా ఫలితం లేదు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించామని డీఐ నాగేశ్వర్రావు తెలిపారు.