ముక్కుసూటితనంతోనే మంట: ప్రజాప్రతినిధులతో ఢీ, భాగ్యనగరానికి బదిలీ
హైదరాబాద్: హరితహారం పథకం అమలులో గత ఏడాదిలో నిజామాబాద్ జిల్లాకు తొలిస్థానం. రెండేళ్లలో పలు అభివ్రుద్ధి పథకాల అమలులో భేష్. జాతీయ, రాష్ట్రస్థాయిలో జిల్లాకు వచ్చే పథకాలు వచ్చేలా చేశారు. అంతేకాదు ఉపాధి హామీ పథకంలో జాతీయస్థాయి అవార్డును కేంద్ర గ్రామీణాభివ్రుద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రథమ బహమతి అందుకున్నారు.
ఈ ఏడాది మానవతా సదన్ కార్యక్రమం అమలులోనూ ఫస్ట్ మార్కులే సుమీ.. కానీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఆ ఐఎఎస్ అధికారి యోగితా రాణి. ఇంతకుముందు నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా అద్భుతంగా పనిచేసిన ఆమెను ప్రభుత్వం ఎందుకు బదలీ చేసిందన్న సంగతి అనుమానమా? ఇంతకుముందు ఆమె కలెక్టర్గా పని చేసిన నిజామాబాద్ జిల్లాలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులు చేపట్టడంలోనూ శభాష్ అనిపించుకున్నారు. కానీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కంటగింపుగా మారింది.
కలెక్టర్ ముక్కుసూటితనంపై వారంతా కలిసికట్టుగా సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. కానీ ఆరు నెలల తర్వాత మళ్లీ లేవనెత్తారు. బిల్లుల చెల్లింపులో నిక్కచ్చిగా వ్యవహరించడంతో సమస్యలోస్తున్నాయని సీఎంకు ఏకరువు పెట్టారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం అవసరమైన ఇసుక సరఫరాలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని తేల్చేశారు. దాని ఫలితమే నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా ఆమెను బదిలీ చేసి హైదరాబాద్ కలెక్టర్గా నియమించారు.
పనుల నాణ్యతపై కలెక్టర్ నిశిత దృష్టి
జిల్లాలో ఎమ్మెల్యేలతో ఆమెకు విభేదాలొచ్చాయి. 2015 జూన్ 6న జరిగిన జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలెక్టర్పై మాటలతో దాడికి దిగారు. ప్రజాప్రతినిధుల అభివృద్ధి నిధితో జిల్లాలో చేపడుతున్న పనులు నాణ్యతగా ఉన్నాయా? లేవా అనే విషయాన్ని పరిశీలించేందుకు థర్డ్పార్టీ విచారణకు ఆదేశించారు. ఇది ప్రజాప్రతినిధులకు మింగుడు పడలేదు. దీన్ని పూర్తిగా విభేదించారు. ఈ అంశంపై సమావేశంలో రచ్చరచ్చ అయింది. గత ఏప్రిల్లో జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలోనూ ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, షకీల్ కలెక్టర్ పనితీరును విమర్శించారు. ప్రభుత్వ పనులకు ఇసుక ఇవ్వడం లేదని సమావేశంలో ప్రస్తావించడంతోనే అప్పట్లోనే కలెక్టర్ బదిలీపై వెళ్తారని ప్రచారం జరిగింది.
Recommended Video
రెండేళ్లలో నాలుగు అవార్డులు
కానీ కలెక్టర్గా యోగితా రాణి జనం వద్దకు వెళ్లారు.. కష్టాలు తెలుసుకొన్నారు.. ప్రజాప్రతినిధులు కాదన్నా కదం తొక్కారు. నేను ఉన్నానని ప్రజలతో మమేకయ్యారు.. పాలనలో ప్రత్యేకత చూపి నాలుగు అవార్డులు అందుకొన్నారు.. అనాథలకు వసతి కల్పించి ప్రేమను చాటుకున్నారు.. ఇలా ప్రజల మనసును చూరగొన్న బదిలీపై రాజధాని హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు. జమ్మూకశ్మీర్ నివాసి యోగితా రాణా 2003 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన వారు. 2015 ఆగస్టు 14న నిజామాబాద్ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి, సరిగ్గా రెండేళ్ల తర్వాత బదిలీ అయ్యారు.
రెండేళ్లలో నాలుగు అవార్డులు సొంతం చేసుకొన్నారు. గత ఏడాది హరితహారంలో లక్ష్యానికి మించి మొక్కలు నాటారు. దీంతో గత ఏడాది పంద్రాగస్టు రోజున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకొన్నారు. ఉపాధి హామీలో ఎక్కువ మంది కూలీలకు పనులు కల్పించినందుకు జాతీయ స్థాయిలో అవార్డు స్వీకరించారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ప్రవేశపెట్టిన ఈ-నామ్ను పకడ్బందీగా అమలు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ స్థాయి అవార్డు అందుకొన్నారు. డిచ్పల్లిలో అనాథ పిల్లల కోసం మానవత సదన్ ఏర్పాటు చేయడం వల్ల ఇటీవల ప్రభుత్వం ఉత్తమ పురస్కారాన్ని ప్రకటించింది.
గర్భాశయ ముఖద్వారా కేన్సర్ నివారణకు చర్యలు
గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవి. ప్రస్తుతం 67 శాతానికి పెరిగింది. ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యధికంగా ప్రసవాలు నమోదు కావడంతో రాష్ట్రస్థాయిలో అవార్డు వచ్చింది. వీటి వెనక కలెక్టర్గా పని చేసిన యోగితా రాణా కృషి దాగి ఉంది. మహిళలకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ నివారణకు ముందస్తు నివారణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పుట్టిన ప్రతి బిడ్డకు టీకాలు వేయించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్లో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిపై ప్రత్యేక దృష్టి సారించారు. వైద్యుల పనితీరు మెరుగుదలకు చర్యలు తీసుకొన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి పక్షాలనకు శ్రీకారం చుట్టగా కొందరు వైద్యులకు మింగుడు పడలేదు. అయినా ఆమె ఎవరిని ఖాతరు చేయకుండా తన పని తాను చేసుకుంటు వెళ్లిపోడంతో ఆస్పత్రిలో సేవలు మెరుగుపడ్డాయి.
కేసీఆర్ కిట్ల రూపకల్పనలో కీలక పాత్ర
ఆమెకు జిల్లా ప్రజాప్రతినిధుల సహకారం అంతగా అందలేదనే చెప్పుకోవాలి. అయినా ఆమె తన దైన శైలిలో పరిపాలన అందించారు. ప్రజాప్రతినిధులు విమర్శించినా ఏమాత్రం భయపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లారు. గ్రామ పంచాయతీ, ఉపాధి హామీ సమావేశాలు నిర్వహిస్తే ప్రజలతో కలిసి నేలపై కూర్చొని వారితో మాట్లాడడం వల్ల ప్రజల మన్ననలు పొందారు. ప్రభుత్వ ఆస్పత్రులతో ప్రసవాలు జరిగితే వారికి రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ కిట్లను అందజేస్తోంది. ఈ కిట్లలో పుట్టిన బిడ్డకు అవసరమైన సామగ్రి కిట్టులో ఉంటాయి.. ఈ నిర్ణయం వెనుక కలెక్టర్ యోగితా రాణా ఆలోచన ఉంది. తమిళనాడు రాష్ట్రంలో అమలవుతున్న వైద్యంపై పరిశీలించేందుకు పలువురు అధికారుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం పంపింది. ఈ బృందంలో యోగితా రాణా కూడా ఉన్నారు. తమిళనాడులో వైద్యం కోసం అమలు అవుతున్న పలు పథకాలను వారు బృందానికి నివేదించారు. వారి ఆలోచన మేరకే ప్రభుత్వం కేసీఆర్ కిట్లను ప్రవేశపెట్టింది.
డిచ్పల్లిలో మానవతా సదన్ పిల్లలకు తల్లిలా..
జిల్లా కలెక్టర్గా యోగితా రాణా బదిలీ సమాచారం తెలుసుకున్న మానవతాసదన్ విద్యార్థులు దుఃఖం ఆపుకోలేకపోయారు. బోధన్లోని శ్రీవిజయసాయి పాఠశాలలో 19 మంది మానవతా సదన్ విద్యార్థులను బోధన్ వసతిగృహంలో ఉంచి ఆమె చదివిస్తున్నారు. ఆమె బదిలీ అయ్యారన్న విషయం తెలుసుకుని ఆవేదనకు గురయ్యారు. వారిని ఓదార్చడం పాఠశాల సిబ్బందికి కష్టమైంది. ఆమె ఫోన్లో మాట్లాడించి నచ్చజెప్పారు. అంతేకాదు.. అనాథ పిల్లలను అక్కున చేర్చుకొన్నారు. డిచ్పల్లిలో మానవతా సదన్ను ఏర్పాటుచేసి, 68 మంది పిల్లలకు వసతి కల్పించారు. వారికి విద్యను అందిస్తున్నారు. సదన్లో ఉన్న పిల్లలు కలెక్టర్ను అమ్మగా పిలుస్తున్నారంటే ఎంత మమకారం చూపారో అర్థం చేసుకోవచ్చు.