గోషామహల్ బిజెపి ఎమ్మెల్యేకు బెదిరింపు ఫోన్కాల్స్
హైదరాబాద్: తనను హతమారుస్తామంటూ ఇతర దేశాల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని గోషామహల్ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్ లోథ్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
గురువారం మధ్యాహ్నం 2.45గంటలకు +95125 నంబరుతో ఓ వ్యక్తి ఫోన్ చేసి ‘సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నానని, నీ అంతు చూసేందుకు మా ప్రతినిధులు వెంటాడుతున్నారని బెదిరించారు' అని తెలిపారు.
మళ్లీ సాయంత్రం 4.25 గంటలకు +401 నంబరుతో మరో వ్యక్తి ఫోన్ చేసి ‘ముంబైలోని బీడాబజర్కు రా.. అంతు తేలుస్తాం' అని బెదిరించారని రాజాసింగ్ చెప్పారు. మరోసారి +6744 నంబరు నుంచి పాకిస్థాన్కు చెందిన వ్యక్తి మాట్లాడుతూ.. ‘తమ సంస్థ ప్రతినిధుల నుంచి తప్పించుకోలేవు' అని బెదిరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదు తెలిపారు.
స్పందించిన సిపి విచారణ జరిపించి బాధ్యతులను అరెస్ట్ చేసి, పూర్తి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన రాజాసింగ్ లోథా తెలిపారు. ఆయనకు గతంలో కూడా బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.
మరో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి కూడా గతంలో పలుమార్లు బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే.