జాతీయ జెండాకు అవమానం: ముగ్గురు కాశ్మీరీల అరెస్ట్
హైదరాబాద్: సినిమా థియేటర్లో జాతీయగీతం వస్తున్న సమయంలో లేచి నిలబడకుండా అగౌరవపర్చిన ముగ్గురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఒమర్ ఫైజల్, ముదాబీర్ షబ్బీర్, జమునుగల్లు నగరంలోని రేతిబౌలీలో ఉంటున్నారు.
ఈ ముగ్గురు చేవెళ్లలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదవుతున్నారు. ఆదివారం సాయంత్రం అత్తాపూర్లోని మంత్రామాల్ థియేటర్లో సినిమా చూడటానికి వచ్చారు. సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం వస్తున్న సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడగా.. ఈ ముగ్గురు స్నేహితులు కూర్చొనే ఉన్నారు.
తోటి ప్రేక్షకులు వారిని ప్రశ్నించగా దురుసుగా సమాధానమివ్వడంతో థియేటర్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. జాతీయగీతాన్ని అగౌరవపర్చడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఈ ముగ్గురిని అరెస్ట్ చేశారు.