భూతంలా తుఫాన్: మిత్రుడ్ని బస్సెక్కించడానికి వెళ్తూ పైలోకానికి....
లంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిత్రుడ్ని బస్సెక్కించడానికి బయలుదేరిన యువకులను రోడ్డు ప్రమాదం మింగేసింది.మంగళవారం ఉదయం మండల పరిధిలోని అనంతసాగర్ గేటు సమీపంలో
నాగర్కర్నూలు: తెలంగాణ రాష్ట్రంలోని నాగర్కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిత్రుడ్ని బస్సెక్కించడానికి బయలుదేరిన యువకులను రోడ్డు ప్రమాదం మింగేసింది. నాగర్కర్నూలు జిల్లా తెలకపల్ల మండలం అనంతసాగర్ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
స్నేహితుడిని బస్సు ఎక్కించేందుకు బైక్పై నాగర్కర్నూల్ బయల్దేరిన యువకులు గమ్యం చేరకుండానే మృత్యువాత పడ్డారు. తెలకపల్లికి చెందిన పరమేశ్(18) మహేశ్(17), పవన్(16) స్నేహితులు. మంగళవారం ఉదయం పవన్ను బస్సు ఎక్కించేందుకు హోండా షైన్ బైక్పై ఇద్దరు బయలుదేరారుర.
అనంతసాగర్ స్టేజీ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మహారాష్ట్రకు చెందిన తుఫాన్ వాహనం ఢీకొట్టింది. దీంతో బైకు నుజ్జునుజ్జయింది. బైక్పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
పది రోజుల క్రితమే
పవన్ కొద్దిరోజుల కిందట తెలకపల్లి ఆర్జీ రెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నాడు. అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ఉండడంతో హైదరాబాద్కు బయల్దేరాడు. ఈ క్రమంలో మొదటి బస్సు మిస్ కావడంతో తన మిత్రులతో కలిసి బైక్పై నాగర్కర్నూల్కు వెళ్లి అక్కడి నుంచి హైదరాబాద్కు వెళ్లేందుకు యత్నించారు.
ఆ క్రమంలోనే...
హైదరాబాదుకు బయలుదేరిన పవన్ను ఇతని ఇద్దరు మిత్రులను రోడ్డు ప్రమాదం కాటేసింది. పరమేశ్ తెలకపల్లిలోని గోవర్దనరెడ్డి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం పూర్తి కాగా, మహేశ్ పాలెం అగ్రికల్చర్ కళాశాలలో డిప్లొమా చేస్తున్నాడు.
కుటుంబ సభ్యుల రోదనలు..
ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన నాగర్కర్నూల్ ఏరియా ఆస్పత్రికి చేరుకొని బోరున విలపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఉదయమే ఇలా..
మంగళవారం ఉదయం మండల పరిధిలోని అనంతసాగర్ గేటు సమీపంలో ఆ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఉదయం 5.30 గంటల సమయంలో తెలకపల్లి నుంచి మిత్రులు నాగర్కర్నూల్కు బయలుదేరారు. మార్గమధ్యంలో అనంతసాగర్ గేటు సమీపంలో శ్రీశైలం వెళ్తున్న మహారాష్ట్రకు చెందిన తుఫాన్ ఢీకొనడంతో పవన్, మహేష్, పరమేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
ఒక్కడే కుమారుడు....
పవన్ పదోతరగతిలో 9.3 గ్రేడ్ సాధించాడు. తండ్రి ఇటీవలే మరణించాడు. తల్లికి ఒక్కడే కుమారుడు. ఈ సంఘటనతో మండల కేంద్రంలో విషాదఛాయలు చోటు చేసుకున్నాయి. మహేష్ తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కనకయ్య తెలిపారు.