11 మంది సస్పెన్షన్: వంద మంది టీ జడ్జీలు మూకుమ్మడి సెలవులు
హైదరాబాద్: న్యాయాధికారుల ఆందోళన ముదురుతోంది. ఆందోళనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు మరో ముగ్గురు న్యాయాధికారులను సస్పెండ్ చేసింది. తిరుపతి, రాధాకృష్ణ, రమాకాంత్లను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మంగళవారంనాడు ఆదేశాలు జారీ చేసింది.
ఆ తర్వాత మరో ఆరుగురు న్యాయాధికారులపై కూడా హైకోర్టు సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో ఇప్పటి వరకు హైకోర్టు 11 మంది న్యాయాధికారులను సస్పెండ్ చేసినట్లయింది. ఈ నేపథ్యంలో వాతావరణం వేడెక్కింది. వంద మందికిపై పైగా తెలంగాణ న్యాాయాధికారులు రేపటి నుంచి 15 రోజుల పాటు మూకుమ్మడి సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
సర్వీసు నిబంధనలకు, ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారంటూ తెలంగాణ న్యాయాధికారులపై హైకోర్టు ఇది వరకే ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం అధ్యక్షకార్యదర్శులు కె. రవీందర్ రెడ్డి, వి. వరప్రసాద్లను హైకోర్టు సోమవారంనాడు సస్పెండ్ చేసింది.
తాజాగా మరో ఇద్దరిని సస్పెండ్ చేయడంతో సస్పెన్షన్ వేటు పడిన న్యాయాధికారుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ చైర్మన్ మురళీధర్పై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఇదిలావుంటే, వరంగల్ కోర్టు వద్ద న్యాయవాదులు ఆందోళనకు దిగారు. కోర్టు హాల్లో కుర్చీలను విసిరేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
న్యాయాధికారుల కేటాయిపుల్లో తమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని కోరుతూ 120 మంది న్యాయాధికారులు ఆదివారంనాడు హైదరాబాదులో ర్యాలీ నిర్వహించి గవర్నర్ నరసింహన్కు వినతిపత్రం సమర్పంచారు. ఆ మర్నాడు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. హైకోర్టు నిర్ణయంపై తెలంగాణలో న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, న్యాయాధికారుల ఆందోళనకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు పలుకుతోంది. తెలంగాణ న్యాయాధికారుల సస్పెన్షన్ను ఉపసంహరించుకోవాలని తెరాస కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు వనోద్ కుమార్ డిమాండ్ చేసారు. ఢిల్లీలో ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడారు.
న్యాయం చేయాలని కోరితే న్యాయాధికారులను సస్పెండ్ చేయడం బాధాకరమని ఆయన అన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్లపై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడలను కలుస్తామని ఆయన చెప్పారు.