గత్యంతరంలేక సెక్షన్ 8 ఒప్పుకున్నాం: కోదండ, 'సీఎంలను గవర్నర్ గమనిస్తున్నారు'
హైదరాబాద్: నాడు గత్యంతరం లేక సెక్షన్ 8కి ఒప్పుకున్నామని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ ఆదివారం అన్నారు. ఇప్పుడు హైదరాబాదులో ప్రజల మధ్య సఖ్యత పెరిగిందని చెప్పారు.
ఓటుకు నోటు కేసు తప్పుగా పెట్టారనుకుంటే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు. సెక్షన్ 8కు, ఓటుకు నోటు కేసుకు సంబంధమేమిటని ఆయన ప్రశ్నించారు. హైదరాబాదు పైన అధికారముంటే కేసు నుండి బయటపడవచ్చుననే సెక్షన్ 8 డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పుడే కేంద్రం జోక్యం అనవసరం: దత్తాత్రేయ
ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేంద్రం ప్రస్తుత పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 తదితరాల అంశాలను గవర్నర్ గమనిస్తున్నారని, ఆయన పరిష్కరిస్తారని చెప్పారు.
పీవీని ప్రధానిని చేసిన ఘనత ఎన్టీఆర్దే: ఎర్రబెల్లి
దివంగత ప్రధాని పీవీ నర్సింహా రావును ప్రధానిని చేసిన ఘనత ఎన్టీఆర్దేనని తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు. పీవీ కార్యక్రమాలు మొక్కుబడిగా నిర్వహించడం మాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన గౌరవమివ్వాలన్నారు.
పీవీ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి: రాజేశ్వర రావు
పీవీ చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన తనయుడు పీవీ రాజేశ్వర రావు అన్నారు. పీవీకి సరైన గుర్తింపు రాలేదన్నారు. ఆయనకు భారతరత్న ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిఫార్సు చేయాలన్నారు. పీవీ దేశానికి దశదిశ చూపించారన్నారు. ప్రతిపక్షాలు పీవీని స్మరిస్తున్నాయని, ఇది శుభపరిణామం అన్నారు.