లోధా బిల్డర్స్ మోసం, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు: నటుడు జగపతి బాబు
భాగ్యనగరంలో ప్రముఖ బిల్డర్స్గా పేరుగాంచిన లోధా బిల్డర్స్ మోసానికి పాల్పడిందని సినీ నటుడు జగపతి బాబు చెప్పారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో ప్రముఖ బిల్డర్స్గా పేరుగాంచిన లోధా బిల్డర్స్ మోసానికి పాల్పడిందని సినీ నటుడు జగపతి బాబు చెప్పారు. లోధా బిల్డర్స్ వద్ద అపార్టుమెంట్లు కొని మోసపోయిన పలువురు కొనుగోలుదారులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
లోధా బిల్డర్స్ నిబంధనలకు విరుద్ధంగా అపార్టుమెంట్లు నిర్మించిందని జగపతి బాబు చెప్పారు. నగరంలోని కూకట్పల్లిలో పదిన్నర ఎకరాల స్థలంలో అంత్యంత సంపన్న శ్రేణి వర్గాలకు విశాలమైన బెలిజా అపార్టుమెంట్లు నిర్మిస్తామని చెప్పడంతో ఎంతో మంది వాళ్ల మాటలు నమ్మి కొన్నారని, అయితే తమకు కేటాయించిన 10.5 ఎకరాల స్థలంలోనే మూడు ఎకరాల్లో మెరిడియన్ అపార్ట్మెంట్స్ను నిర్మించారని జగపతి బాబు వెల్లడించారు.
జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా కాంపౌండ్ వాల్ కూడా నిర్మించి తమ ప్రైవసీని దెబ్బతీశారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని, తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని జగపతిబాబు స్పష్టం చేశారు.
మొత్తం పదిన్నర ఎకరాల్లో గ్రేటర్ కమ్యునిటీని నిర్మిస్తామని చెప్పి.. ఏడున్నర ఎకరాల్లోనే నిర్మించారని బెలిజా అపార్ట్మెంట్స్ యజమానులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా పక్కనే నిర్మిస్తున్న లో ఎండ్ అపార్ట్మెంట్లను కూడా తమ గ్రేటర్ కమ్యునిటీలోనే కలుపుతున్నారని ఆందోళనకు దిగారు. దీనిపై జీహెచ్ఎంసీ స్పందించకపోతే కోర్టుకు వెళతామని బాధితులు చెబుతున్నారు.