ఎత్తుకెళ్లి గిరిజన బాలికపై గ్యాంగ్ రేప్: ఆపై హత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో 14 ఏళ్ల గిరిజన బాలికను ఐదుగురు గుర్తుతెలియని యువకులు ఎత్తుకెళ్లి సామూహికంగా అత్యాచారం జరిపి, ఆ తర్వాత హతమార్చారు. రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బారువాడ తండాకు చెందిన మెగావత్ సిమ్రా అనే 14 ఏళ్ల గిరిజన బాలిక తన తండ్రితో కలిసి హ్యాండ్పంపు వద్ద నీళ్లు తాగుతుండగా కొందరు యువకులు వచ్చి బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లారు.
శుక్రవారం ఉదయం బాలిక మృతదేహాన్ని తండావాసులు కనుగొన్నారు. తండావాసుల ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిపి, హతమార్చారని పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి పంపించారు. నిందితులు పరారీలో ఉన్నారు.
మహిళ ఆత్మహత్య
ఓ వివాహిత ఆత్మహత్యకు దారితీసిన సంఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కుటుంబ కలహాల వల్లనే ఆ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన స్వప్న భర్తతో రాజుకున్న వివాదంతో పురుగుల మందు తాగి, ఆపై బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలముకుంది.
ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ పట్టణంలో గణేశ్ అనే 35 ఏళ్ల వ్యక్తి అతిగా గుడంబా తాగి మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.