వరంగల్ లో ప్రారంభమైన టీఆర్ఎస్ ఆవిర్భావ సభ.. సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఉత్కంఠ
వరంగల్లో టీఆర్ఎస్ ‘ప్రగతి నివేదన సభ’ గురువారం సాయంత్రం ప్రారంభమైంది. పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ఎదురేగి స్వాగతం పలికి, సభావేదికపైకి తోడ్కొని వెళ్లారు.
హైదరాబాద్: వరంగల్లో టీఆర్ఎస్ 'ప్రగతి నివేదన సభ' గురువారం సాయంత్రం ప్రారంభమైంది. హన్మకొండ ప్రకాశ్రెడ్డి పేటలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ భారీ బహిరంగ సభ జరుగుతోంది.
ఈ 16వ టీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సభావేదికకు 'ప్రగతి నివేదన సభ' అని పేరుపెట్టారు.
సభ ప్రారంభానికి ముందు వేదికపై తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సభలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ సాయంత్రమే బయలుదేరారు.
ప్రగతి భవన్ నుంచి నేరుగా బేగంపేట ఎయిర్పోర్టుకు బయల్దేరిన ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ప్రకాశ్రెడ్డిపేటకు బయల్దేరారు. ప్రకాశ్ రెడ్డి పేటకు చేరుకున్న తరువాత సీఎం హెలీకాప్టర్ నుంచే సభా ప్రాంగణాన్ని వీక్షించారు.
చుట్టుపక్కల ప్రాంతాల్లోని వాహనాలను, సభకు హాజరైన జనాన్ని సీఎం హెలీకాప్టర్ గుండానే వీక్షించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న పలువురు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ఎదురేగి స్వాగతం పలికి, సభావేదికపైకి తోడ్కొని వెళ్లారు.
వేదికపై ఈ రోజు ఆయన గంట సేపు ప్రసంగిస్తారని తెలుస్తోంది. ఈ సభలో సుమారు మూడు వేల మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు. అంచనాలకు మించి ప్రగతి నివేదన సభకు జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎక్కడా చూసినా జనాలే. ఇసుకెస్తే రాలనంత జనం. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు రైతన్నలు సభా వేదిక వద్దకు చేరుకున్నారు.