సస్పెన్స్కు తెర, గట్టెక్కిన తెరాస: పల్లా గెలుపు
వరంగల్: నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎన్నికయ్యారు. నలభై గంటలపాటు ఉత్కంఠభరితంగా, నిర్విరామంగా సాగిన ఓట్ల లెక్కింపులో తెరాసను విజయం సాధించింది. బుధవారం మొదలైన ఓట్ల లెక్కింపు, గురువారం రాత్రికి ఫలితం వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి తన సమీప బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు పై 12,723 ఓట్ల ఆధిక్యత సాధించారు.
విజయానికి నిర్ధేశించిన 66,777 ఓట్ల మైలురాయిని చేరుకునేందుకు అవసరమైన 7,023 ఓట్లను రెండో ప్రాధాన్యత ఓట్ల నుండి సేకరించి పల్లాకు కలపడంతో గెలిచారు. పల్లా రెండో ప్రాధాన్య ఓట్లతో బయటపడ్డారు. మొత్తంమీద, 11,773 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రాంమోహన్ రావుపై గెలిచారు. వాస్తవానికి, ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరుపై బండి నడకని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడో చెప్పారు.
అయినా, భారీ సంఖ్యలో మంత్రులను మోహరించారు. అధికార పక్షం సర్వశక్తులూ ఒడ్డింది. అయినా, అధికార పార్టీ అభ్యర్థిని మొదటి ప్రాధాన్య ఓట్లతో గెలిపించడానికి పట్టభద్రులు విముఖత వ్యక్తం చేశారు. మొత్తం ఓట్లు 2,81,138. కాగా, పోల్ అయిన ఓట్లు 1,53,548. వీటిలో చెల్లని ఓట్లు 14,039. ఇక, నోటా కింద 5,956 ఓట్లు పోలయ్యాయి. పోల్ అయిన ఓట్లలో చెల్లనివి తొలగించగా మిగిలినవి 1,33,553. మొదటి ప్రాధాన్యతా ఓటుతో ఏ అభ్యర్థి అయినా విజయం సాధించాలంటే 66,777 ఓట్లు సాధించాల్సి ఉంది.
మొదటి ప్రాధాన్యతా లెక్కింపులో తెరాస అభ్యర్థి పల్లా 59,764 ఓట్లు సాధించగా, ఆయన సమీప ప్రత్యర్థి, టీడీపీ బలపర్చిన బీజేపీ అభ్యర్థి రామ్మోహన్ రావు 47,041 ఓట్లు సాధించారు. మొదటి రౌండ్లో అధికార పార్టీ అభ్యర్థి 12,723 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్ బలపర్చిన తీన్మార్ మల్లన్నకు 13,033 ఓట్లు వచ్చాయి. వామపక్షాల అభ్యర్థి సూరం ప్రభాకర్ రెడ్డి 11,580 ఓట్లు దక్కించుకున్నారు.
దీంతో రెండో ప్రాధాన్యతా ఓటు కోసం తిరిగి లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. అతి తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థి ఖాతా నుంచి రెండో ప్రాధాన్యత ఎవరికి వచ్చిందో గుర్తించి వారికి ఓట్లను బదలాయిస్తూ వెళ్లారు. ఎలిమినేషన్ ప్రక్రియలో 20వ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఓట్ల బదలాయింపు సగం పూర్తి కాగానే రాజేశ్వర్ మ్యాజిక్ ఫిగర్ 66,777కు చేరుకున్నారు. దాంతో, ఆయన గెలిచినట్లు ప్రకటించారు. ఇక బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్రావుకు 55,004 ఓట్లు వచ్చాయి.