ఖేడ్లో టిఆర్ఎస్ పోటీ: కాంగ్రెస్కు హరీష్ షాక్, 'మంత్రివర్గ విస్తరణ' ఉత్తిదే
హైదరాబాద్: నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు స్పష్టం చేశారు. సభ్యులు ఎవరైనా మృతి చెందితే, వారి స్థానంలో కుటుంబ సభ్యులను నిలబెట్టినప్పుడు పోటీ చేయకుండా ఉండే సంప్రదాయం ఇప్పటి వరకు ఉంది.
అయితే, నారాయణఖేడ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని హరీష్ రావు చెప్పడం గమనార్హం. అయితే, కాంగ్రెస్ పార్టీ ఎవరిని అభ్యర్థిగా నిలబెడుతుందో తెలియాల్సి ఉంది.
హరీష్ రావు మంగళవారం విలేకరులతో మాట్లాడారు. మంత్రివర్గ విస్తరణ పైన వస్తున్నవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం పార్టీ పైన దృష్టి పెడతామని చెప్పారు. పార్టీ కమిటీ, కార్పోరోషన్ పదవులు భర్తీ చేస్తామన్నారు. 25వ తేదీకి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, ఉప ఎన్నికల నోటిఫికేషన్ రావొచ్చన్నారు.
రాబందుల్లా: మధుయాష్కీ
అసెంబ్లీ సమావేశాల నుంచి ప్రతిపక్షాలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ విమర్శించారు. రాజ్యాంగంపై కేసీఆర్కు అవగాహనలేదని, ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు.
తమ బతకును బంగారుమయం చేస్తాడని ప్రజలు కేసీఆర్ చేతికి రాష్ట్రం అప్పగిస్తే రాంబదుల్లా దోచుకుంటున్నారన్నారు. ఫీజులు కట్టలేక రైతుల బిడ్డలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ ఎన్కౌంటర్లతో ఉద్యమాలు ఆగవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ధరల నియంత్రణలో ప్రభుత్వాలు విఫలం: సీపీఐ
పెరుగుతున్న ధరలను నియంత్రించడంలోనూ, రైతుల ఆత్మహత్యలను నివారించడంలోనూ కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని సీపీఐ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ వేరుగా ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం ఆయన ఆధ్వర్యంలో సీపీఐ శ్రేణులు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు ధరలను నియంత్రిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నేతలు ఇప్పుడు వాటిని విస్మరిస్తున్నారన్నారు.