లేదంటే ఆంధ్రాలో కలిపేస్తాం: బలరాంనాయక్ వ్యాఖ్యపై టిఆర్ఎస్ భగ్గు
ఖమ్మం: కాంగ్రెస్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిన సభలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ చేసిన వ్యాఖ్యల పైన టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రానున్న ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్కు ఓటేయకపోతే తెలంగాణను తిరిగి ఆంధ్రలో కలిపేస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
కెసిఆర్ పాలన ఇంత దారుణంగా ఉన్నప్పుడు... తాను చేసిన ఈ వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ అని నమ్మబలికి, రైతు ఆత్మహత్యల తెలంగాణ చేశారని కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఇలాంటప్పుడు ఆ వ్యాఖ్యల్లో తప్పేముందన్నారు.
అయితే, దీనిపై టిఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. బలరాం నాయక్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంపై ఉన్న చిత్తశుద్ధికి బలరాం నాయక్ వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని టిఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.
బలరాం వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో నైతికంగా తప్పుకున్నట్లు రుజువైందని, తెలంగాణ ఎవరి దయాదాక్షిణ్యాలపైనా వేరు పడలేదని, ఇక్కడి ప్రజలు ఆత్మగౌరవంతో కలవడి, నిలబడి పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కర్నె ప్రభాకర్ అన్నారు.
రాష్ట్రం ఇవ్వడంద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూసిన కాంగ్రెస్కు 2014 ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. 1956కంటే ముందున్న తెలంగాణను ప్రజలు తిరిగి తెచ్చుకున్నారని, సాధించిన రాష్ర్టాన్ని నిలబెట్టుకోవడానికి తెలంగాణ ప్రజలు విజ్ఞత ప్రదర్శిస్తారన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను చూసి కాంగ్రెస్ నాయకులకు దిమ్మతిరుగుతోందని, దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, పవర్ పోయి పరేషాన్ అయి, ఆగమయిపోయి కాంగ్రెస్ నేతలు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు.
కాగా, కెసిఆర్ పాలన పైన విపక్షాలు మండిపడుతున్నారు. ఓ వైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటూంటే కెసిఆర్ మాటమాత్రం మాట్లాడటం లేదని, వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయడం లేదని, ఆర్భాటంగా పథకాలు ప్రవేశ పెడుతున్నారని కానీ అవి అమలు కావడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. కెసిఆర్ పాలన నిరంకుశంగా ఉందని ఆరోపిస్తున్నారు.