టీఆర్ఎస్ నేత దారుణ హత్య: ‘అత్యాచారాలు, దందాలే కారణం’
మహబూబాబాద్: జిల్లాలోని దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల గ్రామంలో బుధవారం రాత్రి ఓ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత దారుణ హత్యకు గురయ్యారు. టీఆర్ఎస్ నాయకుడైన కొంపెల్లి యాకయ్య(32)అలియాస్ గొడ్డలి యాకయ్యను గుర్తుతెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు.
కాగా, యాకయ్య జేబులో లభించిన లేఖను బట్టి నక్సలైట్లు చంపి ఉంటారని భావిస్తున్నారు. పార్టీ రేపోణి గ్రామ ఉపాధ్యక్షుడు యాకయ్య కుమ్మరికుంట్లలో బుధవారం రాత్రి మిత్రుడు వెలిశాల శంకర్, మరో ఇద్దరితో కలిసి ఓ షాపులో మద్యం తాగుతున్నారు. మూత్ర విసర్జన కోసం యాకయ్య ఒక్కడే షాపు నుంచి బయటకెళ్లారు.
కాసేపటికి శబ్దం రావడంతో స్థానికులు బయటకొచ్చి పరిశీలించగా యాకయ్య కిందపడి ఉన్నారు. తలకు బలమైన గాయం కనిపించడంతో తొర్రూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే యాకయ్య మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిలో శవపరీక్ష చేయగా తలలో బుల్లెట్ లభించింది.
కాగా, హతుడు యాకయ్య జేబులో సీపీఐ(ఎంఎల్) సూర్యాపేట-నల్గొండ జిల్లా కమిటీ కార్యదర్శి జగదీష్ పేరిట లేఖ లభ్యమైంది. ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడటం, ఇతర దందాలు చేస్తుండటం వల్లే ప్రజాకోర్టులో శిక్ష విధిస్తున్నట్లు లేఖలో పేర్కొనడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై ఎస్పీ కోటిరెడ్డి సమీక్షించారు.