ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తా: కోదండరాంకు టిఆర్ఎస్ షాక్, అరెస్ట్
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను శుక్రవారం కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన అమరుల స్ఫూర్తియాత్ర చేపట్టారు.
హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంను శుక్రవారం కామారెడ్డి జిల్లా బస్వాపూర్లో టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన అమరుల స్ఫూర్తియాత్ర చేపట్టారు.
బస్వాపూర్లో ఈ యాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. కోదండరాం గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో టిఆర్ఎస్ కార్యకర్తలు, జేఏసీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
కాగా, కోదండరాం, జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోలీస్స్టేషన్లో జేఏసీ నాయకులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోదండరామ్కు మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి జేఏసీ ప్రతినిధులు అక్కడకు భారీగా చేరుకుంటున్నారు.
మరోవైపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో కళాకారులు పాటలు పాడారు. మరోవైపు అమరవీరుల స్ఫూర్తియాత్ర కొనసాగిస్తామని కోదండరామ్ ప్రకటించారు.
అన్ని అనుమతులు ఉన్నా యాత్రను కొనసాగనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతిని ప్రశ్నిస్తామనే పాలకులు అడ్డంకులు సృష్టిస్తున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ యాత్రను పూర్తిచేస్తామన్నారు.