బాబు పాలన బాగుంది: టిఆర్ఎస్ నేత ఎర్రబెల్లి, దర్శనం చేయించిన టిడిపి నేత
రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు తిరుమలలో ఆన్నారు.
తిరుమల/హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలన బాగుందని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు శుక్రవారం నాడు తిరుమలలో ఆన్నారు. ఆయన ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పాలన అద్భుతం అన్నారు. ఇద్దరు చంద్రులు కూడా సమర్థవంతంగా పాలిస్తున్నారని చెప్పారు. ఏపీని చంద్రబాబు, తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారన్నారు. కాగా, టిటిడి బోర్డు సభ్యులు అరికెల నర్సారెడ్డి దగ్గర ఉండి ఆయనకు దర్శనం చేయించడం గమనార్హం.
ఎర్రబెల్లి దయాకర రావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు. విభజన నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత తెరాసలో చేరారు.
బ్యాంకర్లు ఇబ్బంది పెట్టవద్దు: మహేందర్ రెడ్డి
రైతుల ఉత్పత్తుల క్రయవిక్రయాలకు డబ్బులు అందేలా చూడాలని బ్యాంకర్లను మంత్రి మహేందర్ రెడ్డి ఆదేశించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పెద్ద నోట్ల రద్దుతో రైతులు, ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు.