వారే వస్తారు: షబ్బీర్, కెసిఆర్పై మందకృష్ణ ఫైర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాల తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నేతలే తమ పార్టీలోకి వస్తారని కాంగ్రెసు తెలంగాణ నాయకుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. వైద్య శాఖలో జరిగన కుంభకోణాల వివరాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజీనామా చేస్తానన్న రాజయ్యను బర్తరఫ్ చేయడానికి గల కారణాలేమిటో చెప్పాలని ఆయన సోమవారం మీడియాతో అన్నారు.
బర్తరఫ్ చేశారంటే భారీగా అవినీతి జరిగి ఉంటుందని ఆయన అన్నారు. కెసిఆర్ ఫిరాయింపు రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కెసిఆర్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్లకు వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయని ఆయన చెప్పారు. వచ్చిన అవినీతి ఆరోపణల్లో ఎక్కువగా ఎక్కువగా సిఎం కార్యాలయంపై, మంత్రులపై, అధికారులపైనే ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. అయ్యప్ప సొసైటీ ఆక్రమణల తొలగింపు పనులను మధ్యలో ఎందుకు ఆపేశారో కెసిఆర్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాటన్నింటిపై విచారణ జరిపించాలని ఆయన కోరారు
ఇదిలావుంటే, తెలంగాణాలో దళితులను ముఖ్యమంత్రిని చేస్తామని హామీ ఇచ్చి, మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక నేత మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని విస్మరించిన కేసీఆర్ రాజయ్యకు డిప్యూటీ సి.ఎం. ఇవ్వటం కూడా ఇష్టం లేదన్నారు. తెలంగాణ మాదిగలను కేసీఆర్ టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. అవినీతి, స్వైన్ఫ్లూలను సాకుగా చూపించి రాజయ్యను బర్తరఫ్ చేశారని ఆయన దుయ్యబట్టారు.
కడియం శ్రీహరికి డిప్యూటీ సి.ఎం. ఇవ్వడాన్ని తాము స్వాగతిస్తున్నామని మంద కృష్ణ మాదిగ అన్నారు. అయితే కడియం సి.ఎం. పదవికి అర్హుడన్నారు. కొడుకు, కూతురు చేసే అవినీతి కెసిఆర్కు కనిపించదా అని ఆయన ప్రశ్నించారు. రాజయ్యను అకారణంగా గొంతు కోశారని ఆయన ఆరోపించారు. 12 శాతం ఉన్న మాదిగలకు మంత్రి పదవుల్లోనూ అన్యాయం జరిగిందన్నారు.