బ్లాక్ ఫిలిం: టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు తెలియదంట, రూ.500 జరిమానా
తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శాసన సభ్యులు యాదయ్య వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం అతికించినందుకు ఈ జరిమానా విధించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి నేత, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శాసన సభ్యులు యాదయ్య వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.500 జరిమానా విధించారు. నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ ఫిలిం అతికించినందుకు ఈ జరిమానా విధించారు.
సైబరాబాద్ పరిధిలోని నానక్రామ్గూడ ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేటు వద్ద ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతంలో సీపీ సందీప్ కుమార్ శాండిల్యతో సహా ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ లేజర్ గన్స్ ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడే ఉన్నారు.
ఆ సమయంలో అటువైపు వచ్చిన ఎమ్మెల్యే యాదయ్య వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వాహనానికి బ్లాక్ ఫిల్మ్ ఉందని, జరిమానా కట్టాలని కోరారు.
ఆ సమయంలో ఎమ్మెల్యే యాదయ్య వాహనంలోనే ఉన్నారు. పోలీసులకు ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తనకు బ్లాక్ ఫిలిం ఉండవద్దనే విషయం తెలియదని చెప్పారని తెలుస్తోంది.
అయితే, మీడియా అక్కడే ఉండి కవరేజ్ చేస్తుండటంతో పోలీసులు ఏం చేయలేక రూ.500 జరిమానా విధించి చలానా ఎమ్మెల్యే చేతికి ఇచ్చి పంపించారు. ఆ తర్వాత బ్లాక్ ఫిలిం తొలగించారు. కాగా, ఈయన కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరారు.