కలెక్టర్ మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్య ప్రవర్తన.. కేసీఆర్ హెచ్చరిక!
వెంటనే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్వాసన తప్పదని సీఎం హెచ్చరించినట్లుసమాచారం.
మహబూబాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె ఏకంగా సీఎం కేసీఆర్ ను నేరుగా కలిసి ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. సీఎంవో కార్యాలయానికి ఇప్పటికే టెలిఫోన్ ద్వారా ఆమె సమాచారం అందించారు.
కాగా, రాష్ట్రంలో చేపడుతున్న మూడో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా.. మహబూబాబాద్ లోను ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా తన పట్ల శంకర్ నాయక్ అమర్యాదగా ప్రవర్తించినట్లు కలెక్టర్ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రులు దీనిపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
అటు విషయం తెలుసకున్న వెంటనే సీఎం కేసీఆర్ సైతం శంకర్ నాయక్ను ఫోన్ ద్వారా మందలించినట్లు తెలుస్తోంది. వెంటనే కలెక్టర్కు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఉద్వాసన తప్పదని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. ఈ విషయంపై కలెక్టర్ ఇప్పటికే ఐఏఎస్ ల సంఘానికి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్యే తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బుధవారం నాడు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చర్యలు లేకుంటే రేపు విధులకు హాజరవమని కలెక్టరేట్ ఉద్యోగులు స్పష్టం చేశారు.