స్వంత సర్వేలు చేయిస్తున్న టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కారణమిదే!
ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన సర్వేల్లో తక్కువ ర్యాంకులు వచ్చిన ఎమ్మెల్యేలు స్వంత సర్వేలు చేయించుకొంటున్నారు. తమ పనితీరును బేరీజు వేసుకొంటున్నారు.ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ చేయించిన సర్వేల్లో తక్కువ ర్యాంకులు వచ్చిన ఎమ్మెల్యేలు స్వంత సర్వేలు చేయించుకొంటున్నారు. తమ పనితీరును బేరీజు వేసుకొంటున్నారు.ఎక్కడ పొరపాటు జరిగిందనే విషయమై ఆరా తీస్తున్నారు.
పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల పనితీరుపై ముఖ్యమంత్రి కెసిఆర్ సర్వే చేయించారు. ఈ సర్వే ఆధారంగా పనీతీరును మార్చుకోవాలని సిఎం పలువురు ప్రజా ప్రతినిధులకు సూచించారు.
అసెంబ్లీ సమావేశాలకు ముందుగా నిర్వహించిన టిఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశంలో జిల్లాల వారీగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధుల పనితీరుపై వచ్చిన సర్వే ఫలితాలను సిఎం అందజేశారు.
ఈ సర్వే ఆధారంగా పనితీరును మార్చుకోవాలని కెసిఆర్ సూచించారు.అయితే ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వే ఫలితాలపై అనుమానాలున్న కొందరు ఎమ్మెల్యేలు స్వంతంగా సర్వేలు చేయించుకొంటున్నారు.ఈ సర్వేల ఆధారంగా కౌంటర్ చెక్ నిర్వహించనున్నారు.
సర్వే ఫలితాల ఆధారంగానే టిక్కెట్లా?
పార్టీ శాసనసభపక్ష సమావేశంలో సర్వే రిపోర్ట్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు.అయితే ఈ సర్వేకు సంబంధించిన సమాచారాన్ని ఆధారంగా టిక్కెట్ల కేటాయింపు ఉండదని సిఎం ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తామని ప్రకటించారు.అయితే టిక్కెట్ల కేటాయింపు విషయంలో సర్వే నివేధికలను పరిగణనలోకి తీసుకొనే అవకాశాలను తోసిపుచ్చలేమని పార్టీ నాయకులు చెబుతున్నారు.అందుకే ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వేల తక్కువ ర్యాంకులు వచ్చిన ఎమ్మెల్యేలు స్వంతంగా సర్వేలను నిర్వహిస్తున్నారు.
బలహీనతలపై కేంద్రీకరణ
ముఖ్యమంత్రి నిర్వహించిన సర్వేలో తక్కువగా ర్యాంకు రావడానికి కారణాలు ఏమిటనే విషయమై ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించారు. అయితే తమ లోపాలు ఎక్కడ ఉన్నాయనే విషయమై ఆరా తీస్తున్నారు. బలాలు ఏమిటీ, బలహీనతలు ఏమిటనే విషయాలను తెలుసుకొనేందుకుగాను సర్వేలు నిర్వహిస్తున్నారు.అయితే ఏడాదిలో రెండు దఫాలు నిర్వహించిన సర్వేల్లో మొదటి సర్వేకు, రెండో సర్వేకు మద్య చాలా వ్యత్యాసం ఉండడం పట్ల కూడ ఎమ్మెల్యేలు ఆందోళనలు చెందుతున్నారు. వీటి కారణాలు తెలుసుకొనేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.
పార్టీ ఫిరాయించిన వారి గ్రాఫ్ కూడ తగ్గింది
2014 ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి పార్టీల నుండి విజయం సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి కూడ అంతంత మాత్రంగానే ఉందని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి.అయితే వారి మాతృసంస్థల పరిస్థితి ఆయా నియోజకవర్గాల్లో బాగుందని సర్వే నివేదికలు వెల్లడించడం పిరాయించిన ఎమ్మెల్యేలకు కూడ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
మళ్ళీ సర్వే నాటికి మార్పు కోసం ప్రయత్నాలు
ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్ళీ సర్వే నిర్వహించే నాటికి తమ పరిస్థితుల్లో మార్పులు వచ్చేలా ప్రయత్నాలను ప్రారంభించారు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కొందరు.అయితే తమ బలహీనతలు తెలుసుకోవడం వల్లే పరిస్థితుల్లో మార్పులు తీసుకురావచ్చనే అభిప్రాయంతో స్వంత సర్వేలకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి మూడోసారి సర్వే ఫలితాల్లో తమ ర్యాంకును మెరుగుపర్చుకొనేందుకు ఈ సర్వేలు ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.