విభజన తీరుపై బాబు వ్యాఖ్యలు: ఎంపీ కవితకు కోపం తెప్పించాయి
అమరావతి: నిబంధనలను సాకుగా చూపి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్కసారిగా వెడెక్కాయి. రాజ్యసభలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ సమాధానంపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం ఆయన ప్రెస్ మీటి పెట్టి రాష్ట్ర విభజన జరిగిన తీరు సరిగా లేదంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆగ్రహాం వ్యక్తం చేశారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ 'నాడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి, నేడు విభజన అన్యాయమంటున్నారు' అని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణకు చంద్రబాబు ఆగర్భ శత్రువని కవిత విమర్శించారు. చంద్రబాబు ఇప్పటికీ తెలంగాణపై విషం చిమ్ముతూనే ఉన్నారని మండిపడ్డారు.
సూటిగా చెప్పండి: జైట్లీ రిప్లైపై చంద్రబాబు అసంతృప్తి, కాంగ్రెసుపై ఫైర్
శుక్రవారం రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదా అంశంపై జరిగిన చర్చలో కాంగ్రెస్, టీడీపీల వైఖరి ఏంటో స్పష్టమైందని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ఎప్పుడూ నోరెత్తని కొందరు జాతీయ నాయకులు నేడు ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారని ఆమె తెలిపారు.
కాగా, తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంసెట్ 2 పేపర్ లీకేజి వ్యవహారంపై కూడా ఆమె స్పందించారు. విద్యార్ధులకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
శుక్రవారం సాయంత్రం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తాను అంతా తమకు అనుకూలంగా చేయాలని అడగడంలేదని, న్యాయం చేయాలని కోరుతున్నానని ఆయన అన్నారు. అప్పుడు అన్నీ ఇస్తామన్నారని, ఇప్పుడేమో నిధులు లేవంటున్నారని ఆయన అన్నారు.
కేంద్రం దగ్గర డబ్బులు లేవు, దేశం భరించలేదు అనుకున్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ కలిసి రాష్ట్ర విభజనకు ఎందుకు అంగీకరించాయని ఆయన అడిగారు. టీడీపీ మిత్ర పక్షం అయినంత మాత్రాన ఏపీకి సహాయం చేయలేమని జైట్లీ అనడంపై చంద్రబాబు స్పందిస్తూ తాము పదవులు అడగడం లేదని, కేంద్రం తమకు జరగాల్సిన న్యాయం చేయాలని అడుగుతున్నామని అన్నారు.
ఇలా చేస్తే పార్లమెంట్పై, రాజ్యాంగంపై ఎలా నమ్మకం కుదురుతుందని ఆయన అడిగారు. రాష్ట్రాన్ని కాంగ్రెసు విభజించిన తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.