జానాకు థాంక్స్, వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్: రేవంత్పై కవిత వ్యంగ్యం
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ప్రతిపక్షాలకు కనీస అవగాహనలేదని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ తమ్మిడిహట్టిపై క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ నేత జానారెడ్డికి ఆమె ధన్యావాదాలు తెలిపారు.
తమ్మిడిహట్టిపై మహారాష్ట్రతో 152 మీటర్లకు ఒప్పందం జరగలేదని జానారెడ్డి రాజకీయాలకు అతీతంగా మాట్లాడి పెద్దరికాన్ని నిలెబట్టుకున్నారని అన్నారు. మిగతా కాంగ్రెస్ నేతలు కూడా జానారెడ్డి బాటలో నడిస్తే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తుమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్లకే కేసీఆర్ సంతకం పెట్టారని విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ మొబిలైషన్ అడ్వాన్సుల పేరిట కోట్లు దండుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రజెంటేషన్లో పస లేదని అన్నారు.
లోయర్ పెన్గంగను తాము నిర్మించలేమని మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. లోయర్ పెన్గంగ ప్రాజెక్టును కాంగ్రెస్, టీడీపీ పట్టించుకోలేదని విమర్శించిన ఆమె ఆదిలాబాద్ రైతుల బాగుకోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు.
గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆదిలాబాద్ వాసులకు సరిగ్గా నీళ్లు అందని పరిస్థితి ఉందని కవిత అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న మూడు ప్రాజెక్టులతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. పట్టువిడుపులుండటం మంచి నేతకు ఉండాల్సిన లక్షణమన్నారు. ఆ లక్షణం కేసీఆర్కు ఉందన్నారు.
రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ అడుగులు వేస్తున్నారని అన్నారు. రేవంత్రెడ్డి అధిష్ఠానం అమరావతిలో ఉందని ఆయన తెలంగాణ మ్యాప్ చూసి మాట్లాడాలని సూచించారు. వర్క్ లేని వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు.
రేవంత్రెడ్డి మొత్తం ప్రాజెక్టులను రాష్ట్ర ఖర్చు తోనే కడుతున్నామని, మహారాష్ట్రకు అనవసరంగా నిధులు ఇస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. టీడీపీ నేత ఎల్ రమణ కనీస అవగాహన లేకుండా లేఖ రాశారని దుయ్యబట్టారు. రేవంత్రెడ్డి, ఎల్ రమణ ఆంధ్రా ప్రయోజనాలు పక్కన బెట్టి తెలంగాణ కోసం పాటుపడాలన్నారు.
మేడిగడ్డ అనేది మహారాష్ట్రకు తెలంగాణకు బోర్డర్లో ఉందని, అందుకే మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నామని ఆమె అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి అయితే అటు ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణకు నీరు అందించొచ్చని అన్నారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాల్సిన బాధ్యత రాష్ట్ర బీజేపీ నేతలదేనన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే బీజేపీ రాష్ట్ర నేతలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్కి ధన్యవాదాలంటూ పోస్టర్లు పెట్టుకున్నారని ఆమె అన్నారు. మేము పెళ్లి చేస్తే మీరు బాజాలు కొట్టుడు కాదని తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల విభజనపై రాద్ధాంతం చేయాల్సిన అవసరంలేదన్నారు. సమస్యలుంటే సీఎం దృష్టికి తీసుకురావాలని ఆయన వాటిని పరిష్కరిస్తారని వెల్లడించారు.