లోక్సభ స్పీకర్తో బెల్జియంలో ఎంపీ కవిత (ఫోటో)
హైదరాబాద్: బెల్జియం పర్యటనలో భాగంగా భారత ఎంపీల బృందం బుధ, గురువారాల్లో యూరోపియన్ పార్లమెంటు ను సందర్శించి యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షులు మార్టిన్ స్కల్జ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలు చర్చకు వచ్చాయి.
భారత్ మరియు యూరోపియన్ యూనియన్ మధ్య వ్యాపార సంబంధాలు, మానవ హక్కులకు సంబంధించిన అంశాలు, ఈ నవంబర్లో జరుగనున్న భారత్, యూరోపియన్ యూనియన్ శిఖరాగ్ర సమావేశాలతో పాటూ యూరోప్ ఆసియా ఖండాల మధ్య సంబంధాల గురించి ఈ సమావేశాల్లో చర్చించారు.
ఈ సందర్భంగా యూరోపియన్ పార్లమెంటు అధ్యక్షులు మార్టిన్ స్కల్జ్ మాట్లాడుతూ ఈ పర్యటన ఇరు పార్లమెంటుల మధ్య బలమైన సుహృద్భావ సంబంధం ఏర్పరుస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలన్ని పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరాన్ని గుర్తిస్తూ దేశాల మధ్య మంచి వాతావరణం కోసం పర్యటనలు, సమావేశాలు సహకరిస్తాయని అన్నారు.
ఆయా పౌరసమాజాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటుల మీద ఈ భాద్యత మరింతగా ఉంటుందని స్కల్జ్ అన్నారు. ఈ పర్యటనలో భారత బృందానికి లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ నేతృత్వం వహించగా నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు ఇద్దరు బీజేపీ ఎంపీలు, కాంగ్రెస్, శివసేన, బీఎస్పీల తరఫున ఒక్కో ఎంపీ కూడా ఉన్నారు.
లోక్సభ స్పీకర్ సుమిత్రామహాజన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం ఈయూ పార్లమెంట్ వ్యవహారాలపై అధ్యయనంతోపాటు ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాలను వీక్షించారు.
బ్రస్సెల్స్, బెల్జియం, సైప్రెస్, బ్రూజెస్ తదితర నగరాలలో పర్యటించనున్నారు. ఆదివారం రాత్రి బయలుదేరిన ఈ బృందం 26 ఉదయం తిరిగి ఢిల్లీకి చేరుకుంటుంది.